ఉత్కంఠ పోరులో బెంగళూరు ఎఫ్‌సీ విజయం

by  |
ఉత్కంఠ పోరులో బెంగళూరు ఎఫ్‌సీ విజయం
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2020-21లో భాగంగా గోవాలోని జీఎంసీ స్టేడియంలో శుక్రవారం రాత్రి చెన్నయిన్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ విజయం సాధించింది. హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్‌లో చివరకు బెంగళూరుదే పై చేయి అయ్యింది. టాస్ గెలిచిన బెంగళూరు ఎఫ్‌సీ కుడి నుంచి ఎడమకు ఎటాక్ చేయడానికి నిర్ణయించుకుంది. మ్యాచ్ 7వ నిమిషంలోనే బెంగళూరు ఆటగాడు ఆషికీ కురునియన్‌కు రిఫరీ ఎల్లోకార్డు చూపించాడు. ఇరు జట్లు బంతిని తమ నియంత్రణలో ఉంచుకోవడానికి తీవ్రంగా శ్రమించాయి. పాస్‌లు ఇస్తూ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడికి పలు మార్లు ప్రత్నించినా తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి.

రెండో అర్ధభాగంలో మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగింది. ఇరు జట్లకు పలుమార్లు గోల్స్ చేసే ఛాన్స్ వచ్చినా బంతిని గోల్‌పోస్టులోనికి పంపడంలో విఫలమయ్యారు. ఇక మ్యాచ్ 54వ నిమిషంలో బెంగళూరు ఎఫ్‌సీ పెనాల్టీ లభించింది. కెప్టెన్ సునిల్ ఛత్రి ఎలాంటి పొరపాటు చేయకుండా పెనాల్టీని గోల్‌గా మార్చాడు. దీంతో బెంగళూరు ఎఫ్‌సీ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరోవైపు చెన్నయిన్ ఎఫ్‌సీ స్ట్రయికర్లు పదేపదే గోల్స్ చేయడానికి ప్రత్నించినా.. బెంగళూరు డిఫెండర్లు సమర్ధవంతంగా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. నిర్ణీత సమయం ముగిసే సరికి 1-0 తేడాతో చెన్నయిన్‌పై బెంగళూరు విజయం సాధించింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు ఎరిక్ పార్దాలు గెలుచుకోగా, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సురేష్ వాంగ్జంకు దక్కింది.



Next Story