ఆ సమయంలో వారితో జాగ్రత్త.. ఆదమరిస్తే అంతే సంగతులు

by  |
ఆ సమయంలో వారితో జాగ్రత్త.. ఆదమరిస్తే అంతే సంగతులు
X

దిశ, సిద్దిపేట: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఉదయం, పగలు వేళల్లో పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, తదితర వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలన్నారు. రాత్రివేళ అనుమానంగా కాలనీలో సంచరించేవారి గురించి పోలీసులకు సమాచారం వెంటనే అందించాలని తెలిపారు. శివారు కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలని, విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దన్నారు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిదని సూచించారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని ఇంటికి వచ్చేలా చూసుకోవాలన్నారు. పక్కింటి వారిద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మంచిదన్నారు.

ఇంట్లో కుటుంబసభ్యులు బయటికి వెళ్లినప్పుడు మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని, ఏమరుపాటుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టకపోవటమే మంచిదన్నారు. వాటిని బ్యాంక్‌ లాకర్‌లో పెట్టుకోవాలన్నారు. తాళం వేసి ఊరు వెళ్లే ముందు సమీప పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడం మంచిదన్నారు. పోలీస్‌ శాఖకి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలని కోరారు.

ప్రత్యేకంగా చుట్టు పక్కల వారి ల్యాండ్‌ఫోన్‌, సెల్‌ఫోన్‌ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు సమీప పోలీస్‌స్టేషన్లను సంప్రదించాలని తెలిపారు.
రాత్రి సమయంలో బీట్, పెట్రోలింగ్ గస్తీ ముమ్మరం చేస్తామని,బయటికి వెళ్లేటప్పుడు తాళాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలన్నారు. సొంత గ్రామాలకు వెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్ లలో సమాచారం ఇచ్చి వెళ్లాలని తెలిపినారు. ప్రజలు ఎలాంటి సమాచారం ఇవ్వాలన్న డయల్ 100 కాల్, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8333998699 సిద్దిపేట కమిషనరేట్ వాట్స్అప్ నెంబర్ 7901100100 లకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ సూచించారు.

Next Story

Most Viewed