‘పెగాసస్’పై బెంగాల్ దర్యాప్తు

by  |
Mamata Banerjee
X

కోల్‌కతా: దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ‘పెగాసస్’ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఇద్దరు జడ్జీలతో కూడిన ప్యానెల్‌ను నియమించింది. సోమవారం ప్రత్యేక కేబినెట్ మీటింగ్ నిర్వహించిన సీఎం మమత ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం దీదీ మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని ప్రముఖుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేస్తూ, వారిపై నిఘా వేశారన్న ఆరోపణలపై దర్యాప్తునకు నియమించిన ప్యానెల్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 ప్రకారం ఏర్పాటు చేసిన ఈ ప్యానెల్‌‌లో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ ఎంవీ లోకుర్, కోల్‌కతా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య ఉంటారు. ఈ హ్యాకింగ్‌లో ఎవరి హస్తం ఉంది, ఈ అక్రమ చర్యకు ఎలా పాల్పడ్డారు వంటి అంశాలపై ప్యానెల్ దృష్టిసారించనుంది’ అని వివరించారు. పెగాసస్ వ్యవహారంపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అనేక మంది ఫోన్లు ట్యాప్ అయ్యానని అనుమానం వ్యక్తం చేసిన దీదీ.. తాము చేసే ఈ చిన్న ప్రయత్నం కొందరి కళ్లు తెరిపిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. కాగా, పెగాసస్‌ లక్ష్యిత జాబితాలో దీదీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కూడా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


Next Story

Most Viewed