మోడీ సమావేశంపై బెంగాల్ సీఎం మమతా విమర్శలు: సీఎంలు పప్పెట్లా..?

by  |
మోడీ సమావేశంపై బెంగాల్ సీఎం మమతా విమర్శలు:  సీఎంలు పప్పెట్లా..?
X

కోల్‌కతా: కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మోడీ నిర్వహించే వర్చువల్ కాన్ఫరెన్స్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్ సూపర్‌ఫ్లాప్ మీటింగ్ అని పేర్కొన్నారు. రోజూ వేలాది మంది ప్రజలు కరోనాతో చనిపోతుంటే ప్రధాని మోడీ క్యాజువల్‌గా అప్రోచ్ అవుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించే భేటీలో తమను మాట్లాడటానికి అనుమతించడం లేదని, కేవలం పప్పెట్లా మాదిరి కూర్చోబెడుతున్నారని మండిపడ్డారు. తమకు మాట్లాడే అవకాశమివ్వకుంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా లేవనెత్తగలమని ప్రశ్నించారు. ప్రధాని చెప్పేది వింటూ ఆటబొమ్మల్లా కూర్చోవాలా? అని అన్నారు.

దేశంలో డిక్టేటర్‌షిప్ సాగుతున్నదని ఆరోపించారు. ప్రధానితో భేటీ తర్వాత మమతా బెనర్జీ మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రులందరినీ ఆహ్వానించి ప్రధానమంత్రి సమావేశాన్ని నిర్వహించారు. అందులో సీఎంలు అందరూ పప్పెట్లాలాగా కూర్చున్నారు. ఎవ్వరినీ మాట్లాడటానికి అనుమతించలేదు. అలాంటప్పుడు మేం ప్రజల డిమాండ్లను ఎలా లేవనెత్తగలం? మేం బాండెడ్ లేబర్లం కాదు. మమ్మల్ని అవమానించినట్టుగానే భావిస్తున్నాం. ఒక నియంతృత్వం సాగుతున్నది. ప్రధానమంత్రి చాలా అభద్రతాభావంలో ఉన్నారు. కనీసం సీఎంలు చెప్పే విషయాలనూ వినలేని స్థితిలోకి దిగజారారు. ఆయనకు ఎందుకు అంత భయం?’ అని అన్నారు.

కరోనా పరిస్థితులను పీఎం లైట్‌గా తీసుకుంటున్నారని, రాష్ట్రాల నుంచి ఆక్సిజన్, వ్యాక్సిన్, కొవిడ్-19 ఔషధాల డిమాండ్లను వినిపించుకోవడం లేదని విమర్శించారు. ‘దేశంలో సమాఖ్యవ్యవస్థను నాశనం చేస్తున్నారు. పెద్ద పెద్ద భవంతులు, విగ్రహాలు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వానికి సమయమున్నది. కానీ, సీఎంల మాటలు వినడానికి లేదు. దేశమంతా సంకటస్థితిలో ఉంటే పీఎం మాత్రం క్యాజువల్‌గా ఉన్నారు. ప్రతి రోజూ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఢిల్లీ షెహెన్షా ఆల్ ఈజ్ వెల్ అంటున్నారని విమర్శలు కురిపించారు.

నమామి గంగే కాదు.. మృత్యుగంగే

కేంద్ర ప్రభుత్వం నమామి గంగేను మృత్యుగంగేగా మార్చిందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ‘యూపీలో కరోనా డెడ్ బాడీలను గంగాలో పడేశారు. అవి బెంగాల్‌కు ప్రవహిస్తున్నాయి. ఆ మృతదేహాలు నీటిని కలుషితం చేస్తున్నాయి. పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాయి. ఇవి కరోనా వ్యాప్తినీ పెంచుతున్నాయి. చాలా బాడీలు గంగాలో వేస్తుంటే వాటికి సంబంధించిన లెక్కలే లేవు. ప్రకృతిపై ఇంత ఉదాసీనంగా ఉండరాదు. కేంద్ర బృందాలు, సీబీఐ టీములు ఎందుకు యూపీకి వెళ్లి వివరాలు తెలుసుకోవడం లేదు. సీబీఐ ఎందుకు మిన్నకుండిపోతున్నది’ అని పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ కూటమి అవసరం

2024 లోక్‌సభ ఎన్నికల్ల్ బీజేపీని ఎదుర్కోవడానికి ఒక ప్రత్యామ్నాయ కూటమి అవసరమున్నదని దీదీ అభిప్రాయపడ్డారు. ‘మిగతావాళ్లంతా ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక కూటమిగా ఏర్పడాల్సిన అవసరముంది. అది ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి సాగే యుద్ధం’ అని తెలిపారు.

Next Story

Most Viewed