కట్టెల మండీలో టెన్షన్ టెన్షన్.. డబుల్ బెడ్రూం ఇళ్లలోకి చొరబడ్డ లబ్ధిదారులు

by  |
కట్టెల మండీలో టెన్షన్ టెన్షన్.. డబుల్ బెడ్రూం ఇళ్లలోకి చొరబడ్డ లబ్ధిదారులు
X

దిశ, సిటీబ్యూరో : తమ సొంత ఇంటి కలను సర్కార్ విజయం చేస్తుందని ఆశించి ఇన్నాళ్లుగా వేచి ఉన్న లబ్ధిదారుల కోపం కట్టలు తెంచుకుంది. ఏళ్ల తరబడి అద్దె ఇళ్ళలో ఉంటూ అద్దెలు చెల్లించలేక అవస్థలు పడిన లబ్ధిదారులు తమకోసం కట్టెల మండి‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలోకి బలవంతంగా చొరబడ్డారు. వారిని ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు గురువారం అక్కడికి చేరుకున్నారు. తమ కోసం కట్టిన ఇల్లు తమకు తొందరగా కేటాయించాలని ఎమ్ఆర్ఓ కాళ్లు పట్టుకొని బ్రతిమాలారు. కానీ మీరు ఇలా బలవంతంగా చొరబడటం నిబంధనలకు విరుద్ధమని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోతే త్వరలో అధికారికంగా తామే అప్పగిస్తామని అధికారులు చెప్పినా లబ్ధిదారులు వినలేదు. దీంతో లబ్ధిదారులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కట్టెల మండి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

ఇక్కడ నివసిస్తున్న 128 మంది లబ్ధిదారుల కోసం నిర్మించిన ఇళ్లను కేవలం 103 మంది లబ్ధిదారులకు కేటాయించి ఏడాది నుంచి తాళాలు వేసి పెట్టారని, మరోవైపు తాము అద్దెలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు మొరపెట్టుకున్నా అధికారులు బలవంతంగా పలు ఇళ్లు ఖాళీ చేయించారు. ఒక్కొక్క ఇంట్లో రెండు కుటుంబాలు నివాసం ఉంటే ఇద్దరికి ఇల్లు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు అందులో ఏ ఒక్క లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకపోవడం అన్యాయమని లబ్ధిదారులు ప్రశ్నించారు. ఇళ్లలోకి చొరబడిన వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లబ్ధిదారులు మూకుమ్మడిగా నిలదీయడంతో అధికారులు మౌనంగా వెనుదిరిగారు. పది రోజుల క్రితం ఈ ఇళ్లలోకి 23 కుటుంబాలు బలవంతంగా చొరబడ్డారు అని అధికారులు అంటున్నారు. కానీ ఇళ్ల నిర్మాణం పూర్తయిన దాదాపు సంవత్సరం నుంచి తమకు ఇల్లు కేటాయించాలని ఎమ్ఆర్ఓ, కలెక్టర్‌కు పత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో తమ ఇళ్ళలోకి తాము వచ్చామని స్థానికులు వాదిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళి పోయారు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఇక్కడ నెలకొన్నాయి.



Next Story

Most Viewed