సిద్దిపేట కలెక్టర్ క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్ నేతల డిమాండ్

by  |
Bejjanki Congress leaders
X

దిశ, హుస్నాబాద్: చట్టాలను లెక్కచేయని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బెజ్జంకి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెప్యాల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలో కలెక్టర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వరి విత్తనాలు అమ్మిన దుకాణాలను సీజ్ చేస్తామనడమే కాకుండా, అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఫర్టీలైజర్ షాపు యజమానులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. తాను సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్నంతకాలం సుప్రీంకోర్టు, హైకోర్టు, ప్రజాప్రతినిధులు ఏం చేయలేరని, ఖబర్దార్ మీకు చుక్కలు చూపిస్తామనడం సిగ్గుచేటన్నారు. ఆయన మాట్లాడిన మాటలను వీడియో రికార్డు చేసిన పలువురిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ కార్యాలయంలోని సీసీటీవి ఫుటేజీలను సేకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఆరేండ్లుగా సిద్దిపేట జిల్లాలోనే తిష్టవేసి పోలీసుల బలంతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ భూ నిర్వాసితులు నష్టపరిహారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే గ్రామాల్లోని ఇండ్లు ఖాళీచేయించిన అధికారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మాటలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని, వెంటనే రైతులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్, కిసాన్ సెల్ మండలాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్శరాములు, కొమురయ్య, రాజేశం గౌడ్, రవి, మల్లేశం, శరత్, పలు గ్రామాధ్యక్షులు నరేందర్ రెడ్డి, ఐలయ్య తదితరలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed