బోయిన్‌పల్లి కిడ్నాప్‌లో బెజవాడ గ్యాంగ్..!

by  |
బోయిన్‌పల్లి కిడ్నాప్‌లో బెజవాడ గ్యాంగ్..!
X

దిశ, క్రైమ్ బ్యూరో: బోయిన్‎పల్లి కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకూ అనంతపురం, గుంటూరు జిల్లాకు చెందిన వారు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా విజయవాడకు చెందిన మద్దాల సిద్ధార్థ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు మనుషులను సరఫరా చేసినట్టుగా తెరమీదకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ కిడ్నాప్ కేసులో బెజవాడ గ్యాంగ్ పేరు హల్ చల్ అవుతోంది. గత మూడ్రోజుల క్రితం పోలీసులు గోవాలో పట్టుకున్న వ్యక్తిని బెజవాడకు చెందిన సిద్ధార్థగానే భావిస్తున్నారు. ఈ కేసులో అఖిల ప్రియతో పాటు భార్గవ్ రామ్, మాడాల శ్రీను పేర్లు మాత్రమే కీలక పాత్ర పోషించారనే వార్తలు వచ్చాయి.

కానీ, తాజాగా కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రాముడుపాలెంకు చెందిన సిద్ధార్థ కొందరు మనుషులను భార్గవ్ రామ్‌‌కు సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. బెజవాడ లోని పలు జిమ్స్‌కు వస్తున్న వారిని సిద్ధార్థ వీఐపీల వద్ద బౌన్సర్లుగా ఏర్పాటు చేసేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అఖిల ప్రియకు, భార్గవ్ రామ్‌కు కూడా బౌన్సర్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో అఖిల ప్రియ, భార్గవ్ రామ్ ల పేర్లతో పలు వేధింపులకు, బెదిరింపులకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. స్థానికంగా పలువురి మద్దతు కూడా సిద్దార్థకు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా, భార్గవ్ రామ్ కోరిక మేరకు బోయిన్‌పల్లి కిడ్నాప్‌కు పలువురిని సరఫరా చేసినట్టుగా ప్రచారం అవుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధార్థ కోసం తెలంగాణ పోలీసులు రెండు మార్లు విజయవాడ వెళ్లి, సంబంధిత వివరాలను స్థానిక పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల గోవాలో ఎంజాయ్ చేస్తున్న నలుగురిని పోలీసులు అదపులోకి తీసుకున్నట్టుగా, అందులో సిద్ధార్థ తో పాటు మరో ముగ్గురు ఉన్నట్టుగా సమాచారం.

బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదా..

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. గతంలో బెయిల్ పిటిషన్ వేయగా, పోలీసులు సైతం కస్టడీ పిటిషన్ వేయడంతో కోర్టు మూడ్రోజుల కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖిల ప్రియ కస్టడీ విచారణ ముగియడంతో తిరిగి చంచల్‌గూడ మహిళా జైలులో ఉన్నారు. అఖిల ప్రియ అనారోగ్యంగా ఉన్నందున శనివారం ఆమె తరుఫు న్యాయవాది మళ్లీ కోర్టుకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని సీపీ అంజనీ కుమార్ చెబుతుండగా, అఖిల ప్రియ తరుఫు న్యాయవాది మాత్రం ఆమె ఆరోగ్యం బాగోలేదంటూ రిపోర్టులను సైతం కోర్టుకు అందజేశారు. దీంతో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసి, బెయిల్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేశారు.


Next Story

Most Viewed