కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట.. తలనొప్పిగా మారిన ‘త్రిమూర్తుల’ తీరు

by  |
కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట.. తలనొప్పిగా మారిన ‘త్రిమూర్తుల’ తీరు
X

దిశ, మణుగూరు : టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డి పొందిన తరువాత కాంగ్రెస్ పార్టీ జోరు అందుకుంది. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్ జోషులో ఉన్నట్లు నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. మండలంలో నాకు పదవి ఉంది అంటూ ఎవరికి వారే గొడవలు పెట్టుకుంటున్నారని కొందరు నాయకుల ద్వారా తెలుస్తోంది. పదవి నాకు ఉందంటూ ఒకరికి ఒకరు మండలంలో గొడవలు, అల్లర్లు సృష్టించడం కలకలం రేపుతోంది.

నిజానికి అధిష్టానం నుంచి ఎవ్వరికీ పదవులు ఇవ్వలేదనే వాదన మండలంలో చర్చనీయాంశంగా మారింది. మండలంలో ఆ ముగ్గురు నాయకులు ఎవరికి వారే ప్లేక్సీలు తయారు చేసుకొని, ప్రెస్ నోట్స్ పెట్టుకుంటూ పార్టీ పరువుతీస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మండలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేరు చెప్పుకుంటూ మూడు గ్రూపులుగా ఏర్పడి, పార్టీ పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని సమాచారం. మండలంలో ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఇప్పుడిప్పుడే పార్టీ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఆ నాయకులు అలా ప్రవర్తించడం సిగ్గుచేటని ప్రజలు అంటున్నారు.

మండలంలో పార్టీని ముందుకు నడపాల్సిన నాయకులే ఇలా గొడవలు పడితే పార్టీ ఏవిధంగా పని చేస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఆ నాయకుల్లో ఒకరు స్థానిక విలేకరులతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయని పార్టీ కార్యకర్తల ద్వారా తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ ఉంటూ మూడు వర్గాలగా ఏర్పడి ఎమ్మెల్యేల పరువు తీస్తున్నారని కొందరు కార్యకర్తల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎవరికి వారే వారి వారి నివాసాల్లో ప్రెస్‌మీట్స్ ఏర్పాటు చేసుకొని ఆలోచన విధానం లేకుండా స్థానిక విలేకరుల ముందు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ, హేళన చేసుకుంటూ మాట్లాడుతున్నారని పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. చివరికి కార్యకర్తలు ఏ వర్గం వైపు ఉండాలో కూడా తేల్చుకోలేకపోతున్నారు. ఒక వైపు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే మండలంలో ఆ నాయకులు మూడు వర్గాలుగా ఏర్పడి పార్టీ విలువలు దిగజారుస్తున్నారని నిఘా వర్గాలు తెలుపుతున్నాయి. అగ్రనేతలకు తలనొప్పిగా మారిన ఈ నాయకులపై పార్టీ అధిష్టానం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

pinapaka



Next Story