పేషెంట్లు ఫుల్.. బెడ్‌లు నిల్.. పరిష్కారం చూపరా..?

by  |
పేషెంట్లు ఫుల్.. బెడ్‌లు నిల్.. పరిష్కారం చూపరా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐసీయూ బెడ్ల కొరతతో కరోనా పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఆక్సిజన్ బెడ్ల కొరత ఏర్పడిన విధంగా ఐసీయూ బెడ్ల కొరత కూడా ఏర్పడుతుందని తెలిసినా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రాష్ట్రంలో కరోనా చికిత్సలు అందిస్తున్న 116 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 2013 ఐసీయూ బెడ్లు ఏ మాత్రం సరిపోవడం లేదు. గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి ఆసుపత్రుల్లో కొత్తగా చికిత్సల కోసం వస్తున్న పేషెంట్లకు ఐసీయూ బెడ్లు లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది తిరిగి పంపిస్తున్నారు. ఐసీయూ బెడ్ల కొరతతో రోగులు మృత్యువాత పడుతున్నారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

కరోనా కేసులు పెరగుతున్నాకాని ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రోజు రోజుకు రెట్టింపవుతున్న కేసులను అంచనా వేసి ముందస్తుగా ఏర్పాట్లను చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది. వారం రోజుల క్రితం ఆక్సిజన్ బెడ్లకు కొరత ఏర్పడగా ప్రస్తుతం ఐసీయూ బెడ్లకు కొరత ఏర్పడింది. హైదారాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చిన రోగులు ఐసీయూ బెడ్లు అందుబాటులో లేకపోవడంతో చనిపోతున్నారు. ప్రాణనష్టం జరుగుతున్నా కాని ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2013 ఐసీయూ బెడ్లు

రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్సలందిస్తున్న 116 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2013 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా ఐసీయూ బెడ్ల సంఖ్య కూడా పెంచకపోవడంతో ఈ బెడ్లన్ని కూడా పూర్తిగా పేషెంట్లతో నిండిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రికి ఐసీయూలో చేరేందుకు వస్తున్న పేషెంట్లకు బెడ్లు దొరకకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. హైదారాబాద్‌లో ప్రధానంగా కోవిడ్ చికిత్సలు అందిస్తున్న గాంధీ ఆసుపత్రిలో 500, టిమ్స్‌లో 137, కింగ్ కోఠి ఆసుపత్రిలో 150 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. ఈ బెడ్లన్ని కూడా పూర్తిగా పేషెంట్లలో నిండిపోవడంతో కొత్త పేషెంట్లను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. ఐసీయూ బెడ్లు కావాలంటే ఎవరైన డిశ్చార్జ్ అవ్వాలి లేకపోతే ఎవరైనా చనిపోవాలని ఆసుపత్రి సిబ్బంది సమాధానమిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లండని సలహాలిస్తున్నారు.

6597 ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు

కరోనా మరణాలు అత్యధికంగా ఆక్సిజన్ కొరత కారణంతోనే నమోదవుతుండటంతో ప్రభుత్వం ఆక్సిజన్ కొరత తీర్చేందుకు తగిన ఏర్పాట్లను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి సరపడా ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకొని యుద్ద ప్రాతిపాధికన చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రిలో 6,597, ప్రైవేటు ఆసుపత్రుల్లో 11,568 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఆక్సిజన్ అవసరమంటే అక్కడికి చేరవేసి పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నారు. గత 10 రోజుల క్రితం ఆక్సిజన్ బెడ్లకు కొరత ఏర్పడినట్టుగానే ఐసీయూ బెడ్లకు కూడా ఏర్పడుతుందని తెలిసినా ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పెరుగుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగా ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయలేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఐసీయూ బెడ్ల కొరతతో మరణాలు నమోదవుతున్నాయి.

Next Story