మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్

by  |
మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్
X

మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌‌ను.. బీసీసీఐ తన ప్యానెల్ కామెంటేటర్‌గా తప్పించినట్టు ‘ముంబై మిర్రర్’ పత్రిక ఒక కథనం వెలువరించింది. కానీ అతడిని తప్పించేందుకు అసలు కారణమేంటో మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ప్యానెల్ కామెంటేటర్లుగా సునీల్ గవాస్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, మురళీ కార్తీక్‌లను మాత్రం కొనసాగిస్తోంది.

ఇటీవల వర్షం కారణంగా రద్దయిన ధర్మశాల వన్డే కోసం కూడా మంజ్రేకర్ అక్కడకు రాలేదు. అతడిని వన్డే సిరీస్ కామెంటేటర్‌గా తొలగించారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్ నుంచి కూడా మంజ్రేకర్‌ను తప్పించినట్లు సమాచారం.

ఇటీవల కాలంలో మంజ్రేకర్ ధోరణి బీసీసీఐ పెద్దలకు మింగుడుపడట్లేదు. వరల్డ్ కప్ సమయంలో రవీంద్ర జడేజాపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడిని ఒక క్రికెటర్‌గానే తాను భావించనని ‘బిట్స్ అండ్ పీసెస్’ అంటూ మాట తూలాడు. అలాగే మరో ప్యానెల్ కామెంటేటర్ అయిన హర్షా భోగ్లేపై కూడా నోరు జారాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టు సమయంలో హర్షా అర్హతలను ప్రశ్నించాడు. ఆ తర్వాత తన మాటలపై మంజ్రేకర్ పశ్చాత్తాపం వ్యక్తం చేసినా బీసీసీఐ పెద్దల మనసును మాత్రం కరిగించలేకపోయాడు. మంజ్రేకర్ వ్యవహార శైలే అతడి కెరీర్‌కు పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పుకోవచ్చు.

Tags: BCCI, Sanjay Manjrekar, Panel Commentator, Gavaskar, Murali kartik

Next Story