ఐపీఎల్ సీజన్ 14.. రంగం సిద్ధం

by  |
ఐపీఎల్ సీజన్ 14.. రంగం సిద్ధం
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ కోసం బీసీసీఐ రంగం సిద్ధం చేస్తున్నది. గత ఏడాది కరోనా కారణంగా ఆరు నెలలు ఆలస్యంగా యూఏఈలో ఐపీఎల్ నిర్వహించారు. కానీ ఈ సారి షెడ్యూల్ ప్రకారమే ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ సిరీస్ మార్చి 28తో ముగుస్తున్నది. ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లతో పాటు కొంత మంది ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. దీంతో 10 రోజుల విశ్రాంతి అనంతరం ఐపీఎల్ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఏప్రిల్ 11 నుంచి ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. జూన్ 5 లేదా 6న ఐపీఎల్ జరిగే అవకాశం ఉన్నది.

అనధికార సమాచారం పంపిన బీసీసీఐ

ఐపీఎల్ 14వ సీజన్‌ను ఏప్రిల్ 11 నుంచి నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు బీసీసీఐ ఇప్పటికే రాష్ట్రాల అసోసియేషన్లకు మౌఖిక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. కరోనా మార్గదర్శకాలు అమలులో ఉన్నందున ఏయే నగరాల్లో ఐపీఎల్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవడానికే ఈ సమాచారం పంపారు. ఆటగాళ్ల కోసం హోటల్స్ అందుబాటులో ఉన్నాయా? ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడానికి స్టేడియంలు సిద్ధంగా ఉన్నాయా? బయోబబుల్ చేయడానికి అనుకూల వాతావరణం ఉన్నదా లేదా అనే సమాచారాన్ని తెప్పించుకుంటున్నది.

ఇప్పటికే బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఐపీఎల్ ఇండియాలోనే నిర్వహిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. ఇంగ్లాండ్ సిరీస్‌ను కేవలం మూడు వేదికల్లోనే నిర్వహిస్తున్నారు. ఇండియాలో బయోబబుల్ వాతావరణంలో నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే. అక్కడ విజయవంతం అయితే ఐపీఎల్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించవచ్చని బీసీసీఐ భావిస్తున్నది. ఐపీఎల్ ఫ్రాంచైజీల హోమ్ గ్రౌండ్లకు దగ్గరలో 5 స్టార్ సౌకర్యం గల హోటల్స్‌ను ముందుగానే బుక్ చేసుకోవాలిని ఆయా జట్ల యాజమాన్యాలకు కూడా తెలియజేసినట్లు సమాచారం.

మినీ వేలం..

ఫిబ్రవరి 18న చెన్నైలో ఐపీఎల్ మినీ వేలం నిర్వహిస్తున్నారు. ఈ సీజన్ టైటిల్ స్పాన్సర్ ఖరారు కానందుగా వేలాన్ని ఎలాంటి లోగోలు లేకుండా జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఫ్రాంచైజీలు విడుదల చేసిన క్రికెటర్లతో పాటు కొత్తగా మరికొంత మందిని ఈ మినీ వేలంలో అమ్మకానికి పెట్టనున్నారు. దాదాపు 100 మంది క్రికెటర్లు ఈ వేలంలో అందుబాటులో ఉండనున్నారు. పలు ఫ్రాంచైజీలు కొత్త ప్లేయర్లను తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాయి. ఆర్సీబీ అందరికంటే ఎక్కువగా ప్లేయర్లను విడుదల చేసింది.

అలాగే, పంజాబ్, రాజస్థాన్ జట్లలో కీలక స్థానాల్లో క్రికెటర్లు లేరు. దీంతో ఈ రెండు ఫ్రాంచైజీలు కూడా వేలంలో క్రికెటర్లను కొనే అవకాశం ఉన్నది. మినీ వేలం ముగిసన వెంటనే టైటిల్ స్పాన్సర్‌ను వెతికి.. ఆ వెంటనే బయో సెక్యూర్ వాతావరణాన్ని ఏర్పాటు చేసే సంస్థను కూడా వెతకాల్సి ఉన్నది. ఇవన్నీ ఫిబ్రవరి చివరలోగా పూర్తవుతాయని అరుణ్ ధుమాల్ స్పష్టం చేస్తున్నారు. ఈ సీజన్ ఇండియాలోనే నిర్వహిస్తున్నందున ఫ్రాంచైజీలకు ఆర్దిక భారం తగ్గే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే ప్రేక్షకులను అనుమతిస్తే గేట్ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ త్వరలో జరగబోయే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు.



Next Story

Most Viewed