మహిళా క్రికెట్‌పై బీసీసీఐ నజర్..!

by Shyam |

<p>ఆస్ట్రేలియా తరహా ప్రణాళిక అమలుకు యోచన క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధించే ఇండియాలో మహిళా క్రికెట్‌ వెనకబడేవుందన్న మాట వాస్తవం. మహిళా జట్ల అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా ప్రేక్షకులు సంఖ్య ఎక్కువగా ఉండదు. టీవీల్లో ప్రసారం చేసినా యాడ్స్ రావు, టైమ్ స్లాట్ వేస్ట్ అని బ్రాడ్‌కాస్టర్లు భావిస్తుంటారు. దీంతో ఇప్పటికీ ఇండియాలో మహిళా క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేదు. ఒకవైపు పురుషుల క్రికెట్‌పై వందల కోట్లు కుమ్మరిస్తున్న బీసీసీఐ మహిళా క్రికెట్‌కు వచ్చేసరికి ఎందుకో సరైన [&hellip;]</p>

మహిళా క్రికెట్‌పై బీసీసీఐ నజర్..!
X

ఆస్ట్రేలియా తరహా ప్రణాళిక అమలుకు యోచన

క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధించే ఇండియాలో మహిళా క్రికెట్‌ వెనకబడేవుందన్న మాట వాస్తవం. మహిళా జట్ల అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా ప్రేక్షకులు సంఖ్య ఎక్కువగా ఉండదు. టీవీల్లో ప్రసారం చేసినా యాడ్స్ రావు, టైమ్ స్లాట్ వేస్ట్ అని బ్రాడ్‌కాస్టర్లు భావిస్తుంటారు. దీంతో ఇప్పటికీ ఇండియాలో మహిళా క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేదు. ఒకవైపు పురుషుల క్రికెట్‌పై వందల కోట్లు కుమ్మరిస్తున్న బీసీసీఐ మహిళా క్రికెట్‌కు వచ్చేసరికి ఎందుకో సరైన విధంగా స్పందించడం లేదనే విమర్శలూ ఉన్నాయి. అసలు మహిళా క్రికెట్‌ను బీసీసీఐ ఓన్ చేసుకోవడానికే కొన్నేండ్లు పట్టింది. కానీ, మేజర్ టోర్నీల్లో ఆడిన అనుభవం లేని యువ మహిళా జట్టు ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్ దాకా చేరి సంచలనం సృష్టించింది. ఫైనల్‌లో ఓడినా.. అది బలమైన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుపై కావడంతో అభిమానులు కూడా ఓటమిని హుందాగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇకపై మహిళా క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలనే సూచనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా బోర్డు వ్యహరిస్తున్న తీరును గమనించాలనే సలహాలు అందుతున్నాయి.

ఆస్ట్రేలియా ఏం చేస్తోంది..?

క్రికెట్ ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోందో మహిళా జట్టుకు కూడా అంతే స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తోంది. 2017లో మహిళా క్రికెటర్ల వేతనాలను 125 శాతం పెంచింది. ఆస్ట్రేలియాలో ఎంతో ఆదరణ పొందిన బిగ్ బాష్ లీగ్‌ను మహిళా క్రికెటర్లతో కూడా నిర్వహిస్తోంది. దీనికి తోడు దేశవాళీ మహిళా క్రికెట్‌ను ఎంతగానో ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ వేదికల్లో మహిళా క్రికెటర్లు అనుభవం గడించేలా వారిని సిద్ధం చేస్తూ.. మహిళా క్రికెట్‌కు పాపులారిటీని తెచ్చేందుకు చాలా కృషి చేస్తున్నది. అందుకు తాజా ఉదాహరణ మిచెల్ స్టార్క్ ‘లీవ్’. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా పురుషుల జట్టు ఆటగాడు స్టార్క్.. మహిళా టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో తన భార్య ‘అలీసా హీలి’ ఆటను చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్తానంటే యజమాన్యం వెంటనే పర్మిషన్ ఇచ్చింది. ఈ తరహా చర్యలు మహిళా క్రికెట్‌కు ఆదరణ కల్పిస్తాయనడంలో సందేహం లేదు. కాగా ఇదే మ్యాచ్‌లో స్టార్క్ భార్య హీలి దుమ్ము రేపే బ్యాటింగ్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా ఎంపిక కావడం గమనార్హం.

ఇక భారత్‌లోనైతే మహిళా క్రికెట్ ఇంకా బాలారిష్టాలను కూడా దాటలేదు. మన దేశవాళీ మహిళా క్రికెట్ పురుషుల రంజీలకు ధీటుగా లేదు. ఒక్కోసారి మహిళా జట్లు సాధారణ స్కూప్ పిచ్‌లపై ఆడాల్సి వస్తోంది. అంతర్జాతీయ స్థాయి పిచ్‌లలో ఎప్పుడో గాని ఆడటం లేదు. వీరి వేతనాలు కూడా తక్కువే. పురుష జట్టుతో కలసి కాంట్రాక్టు ఉండటం వల్ల మహిళా జట్టుకు స్పాన్సరర్లు దొరుకుతున్నారు. లేకపోతే అది కూడా దక్కేది కష్టమే. ఇన్ని ప్రతికూలతల నడుమ మహిళా జట్టు సంచలనాలు సృష్టిస్తోంది. దీంతో ఇకపై మహిళ జట్టును కూడా పురుషుల జట్టుతో సమానంగా సిద్దం చేయాలని బీసీసీఐ యోచిస్తోంది.

మహిళా జట్టుకు గవాస్కర్ అండ

ప్రపంచ టీ20 కప్‌లో ఓడిపోయిన భారత మహిళ జట్టుకు మాజీ క్రికెటర్ గవాస్కర్ అండగా నిలిచాడు. మహిళలు తమ శక్తి సామర్థ్యాల మేరకు రాణించారని ఆయన ప్రశంసించాడు. ఆస్ట్రేలియాపై ఓడినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మహిళా క్రికెట్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నాడు. వారికి కూడా పూర్తి స్థాయిలో ఐపీఎల్ నిర్వహిస్తే టీ20ల్లో ఒత్తిడిని జయించేలా రాటుదేలుతారని అన్నాడు. ఐపీఎల్ తర్వాత భారత పురుషుల జట్టు మరింత పటిష్టంగా మారిన విషయాన్ని అతడు గుర్తు చేశాడు.

Tags: BCCI, Australia, India, women cricket team, T20 final

Next Story