మరోసారి సుప్రీం తలుపుతట్టిన బీసీసీఐ

by  |
మరోసారి సుప్రీం తలుపుతట్టిన బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్ :

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్ష, కార్యదర్శులుగా సౌరవ్ గంగూలీ, జై షా 2025 వరకు కొనసాగేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత ఏడాది అక్టోబర్‌లో వీరిద్దరూ పదవీ బాధ్యతలు స్వీకరించారు. కానీ బోర్డు రాజ్యంగం ప్రకారం తక్కువ పదవీకాలం ఉండటంతో వీళ్లు దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు, బీసీసీఐ కలిపి ఆరేండ్ల కంటే ఎక్కువ సమయం ఏ సభ్యుడు పదవుల్లో ఉండకూడదు. ఈ నేపథ్యంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌లో జైషా, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌లో గంగూలీ ఐదేండ్లకు పైగా పదవుల్లో ఉండటంతో ఇప్పుడు బీసీసీఐలో వీరికి పదవీ గండం ఏర్పడింది.

వీరిద్దరి పదవీ కాలాన్ని పెంచడానికే గత ఏడాది డిసెంబర్‌లో బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించారు. అదే సమయంలో సవరించిన రాజ్యాంగం ప్రకారం వీరిద్దరి పదవీ కాలాన్ని పెంచాలని డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టీస్ లోధా కమిటీ సిఫార్సుల మేరకు వీరిద్దరూ ఆరేండ్ల కంటే ఎక్కువ సమయం పదవుల్లో ఉండటానికి వీళ్లేదు. కానీ గత రాష్ట్ర అసోసియేషన్ పదవులు.. ప్రస్తుతం బీసీసీఐలో మిగిలిన సమయం కలపడంతో ఇప్పటికే జై షా అనర్హుడు కాగా.. జులైలో గంగూలీ పదవీకాలం కూడా తీరిపోతుంది. దీంతో రెండోసారి బీసీసీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీసీఐ రాజ్యాంగలంలోని రూల్ నెంబర్ 6.4ను సవరణను ఆమోదించాలని ఈ పిటిషన్‌లో కోరారు. ఇంతకు ముందే పిటిషన్ వేసినా సుప్రీం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రస్తుతం వీరి పదవీకాలం ముగిసిపోతున్నందున వెంటనే నిర్ణయం వెలువరించాలని బీసీసీఐ కోరింది. వార్షిక సర్వసభ్య సమావేశంలో చేసిన సవరణ మినిట్స్‌ను కూడా పిటిషన్‌కు జత చేసింది. వెంటనే దీనిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని.. ప్రస్తుతం బీసీసీఐ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Next Story

Most Viewed