మీరెందుకు వినాయక విగ్రహాలు తయారు చేయకూడదు : కలెక్టర్

by  |
Nagar Kurnool Collector Uday Kumar
X

దిశ, నాగర్ కర్నూల్: కుల వృత్తిపై ఆధారపడి బతుకుతున్న కుమ్మర కులస్థులు మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయాలని, వారికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు అందిస్తామని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ భరోసా ఇచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కుమ్మర కులస్థులు కలెక్టర్‌కు మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారితో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. మట్టి వినాయక విగ్రహాల నిర్మాణంపై చర్చించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి విగ్రహాలు తయారుచేసి సొమ్ము చేసుకుంటున్నారని, ఇక నుంచి మనమే వాటిని తయారు చేయాలని సూచించారు. గ్రూపుగా మారి యంత్రం తెచ్చుకొంటే చక్కని ఉపాధి లభిస్తుందని తెలిపారు. దీనికి బ్యాంకులో రుణ సదుపాయం కూడా ఉంటుందని, అవసరమైతే జిల్లా యంత్రాంగం అవసరమైన సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం మార్కెట్‌లో వీటికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు. వచ్చే వినాయక చవితికి స్వయంగా మీరు తయారు చేసిన వినాయకుడి విగ్రహం నాకు బహుమతిగా ఇవ్వాలని కలెక్టర్ వారిని కోరారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం అధ్యక్షుడు రఘుబాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో 8 అంగుళాల సైజులో వెయ్యి వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేయించామని, వీటిని నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి 400, అచ్చంపేటకు 200 కొల్లాపూర్‌కు 200, కల్వకుర్తి మున్సిపాలిటికీ 200 చొప్పున అందజేశామని తెలిపారు. ప్రభుత్వ సహకారం ఉంటే మట్టితోనే నాణ్యమైన విగ్రహాలను తయారు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాష్, అధ్యక్షుడు రఘుబాబు, ఉపాధ్యక్షులు జంగయ్య, సుల్తాన్, సభ్యులు రాములు, మల్లేష్, అర్జున్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed