‘రేటింగ్స్ కోసం అర్నాబ్ రూ. 40లక్షలు ఇచ్చారు’

by  |
‘రేటింగ్స్ కోసం అర్నాబ్ రూ. 40లక్షలు ఇచ్చారు’
X

న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ చానెల్‌కు అనుకూలమైన రేటింగ్స్ కోసం ఆ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి తనకు డబ్బులు అందించారని బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా వెల్లడించారు. మూడేళ్లకాలంలో రూ. 40 లక్షలు ఇచ్చారని, విదేశీ ట్రిప్పుల కోసం 12వేల యూఎస్ డాలర్లను ముట్టజెప్పారని ముంబయి పోలీసులకు రాతపూర్వకంగా అందజేసిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఈ నెల 11న ముంబయి పోలీసులు దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో బార్క్ ఫోరెన్సిక్ రిపోర్ట్, గుప్తా, అర్నాబ్‌ల వాట్సాప్ చాట్ వివరాలను జత చేశారు.

‘అర్నాబ్ గోస్వామి నాకు 2004 నుంచి తెలుసు. టైమ్స్ నౌలో ఇద్దరం కలిసి పనిచేశాం. 2013లో నేను బార్క్‌లోకి వస్తే, అర్నాబ్ 2017లో రిపబ్లిక్ టీవీ చానెల్ పెట్టారు. దీనికంటే ముందే చానెల్ రేటింగ్‌ల గురించి నాతో మాట్లాడేవారు. టీఆర్‌పీ వ్యవస్థ గురించి నాకు సమగ్ర అవగాహన ఉన్నదన్న విషయం అర్నాబ్‌కు తెలుసు. పరోక్షంగా తన చానెల్‌కు మంచి రేటింగ్‌లు ఇవ్వడానికి సహకరించాలని కోరుతుండేవారు. ప్రతిగా నాకు భవిష్యత్‌లో సహాయపడతానని చెబుతుండేవారు. ఆయన చానెల్‌కు మంచి రేటింగ్ రావడానికి నా టీమ్ పనిచేసింది. అందుకే రిపబ్లిక్ టీవీ రేటింగ్ నెంబర్ 1 పొందింది. అప్పటి నుంచి అర్నాబ్ నన్ను వ్యక్తిగతంగా కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లకు ఫ్యామిలీ ట్రిప్ కోసం ఆరు వేల డాలర్లు, స్వీడన్, డెన్మార్క్‌లకు ట్రిప్ కోసం మరో ఆరు వేల డాలర్లు అందించారు. 2017లో ఐటీసీ పరేల్ హోటల్‌లో కలిసి రూ. 20 లక్షలు, 2018, 2019లలో రెండుసార్లు పదిలక్షల చొప్పున ఇచ్చారు’ అని దాస్‌గుప్తా తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed