ప్రైవేటీకరణకు బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మరో మూడు బ్యాంకుల ఎంపిక!

by  |
ప్రైవేటీకరణకు బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మరో మూడు బ్యాంకుల ఎంపిక!
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రకటనలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ప్రక్రియ వేగవంతమవుతోంది. దీనికోసం ఇప్పటికే నాలుగు మధ్యస్థాయి బ్యాంకులను ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. వీటిలోంచి రెండు బ్యాంకులను 2021-22 ఆర్థిక సంవత్సరంలో విక్రయించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఎంపిక చేసిన బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ఉన్నాయి. వీటిలోంచి రెండింటిని ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

ప్రధాన బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ప్రజల నుంచి, యూనియన్ సంఘాల నుంచి వ్యతిరేకత తీవ్రమవుతుందనే అంచనాల నేపథ్యంలో మధ్యస్థాయి బ్యాంకులను ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మధ్యస్థాయి బ్యాంకుల ప్రైవేటీకరణతో తర్వాతి పరిణామాలను బట్టి భవిష్యత్తులో మరిన్ని బ్యాంకుల ప్రైవేటీకరణకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణకు కనీసం 5-6 నెలలు సమయం పడుతుందనే అంచనాలున్నాయి.

కాగా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50 వేలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలు, సెంట్రల్ బ్యాంకులో 33 వేలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 వేల మంది ఉద్యోగులున్నారు. తక్కువ మంది ఉద్యోగులు ఉన్న బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత తక్కువ ఉంటుందని ప్రభుత్వ భావిస్తోంది. మరోవైపు రెండు బ్యాంకులు, ఒక బీమా కంపెనీని ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత యూనియన్లు ఆందోళన చేపడుతున్నాయి.


Next Story

Most Viewed