మూడు రెట్లు పెరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక లాభం

by  |
మూడు రెట్లు పెరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక లాభం
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాడ్ లోన్స్ ఒత్తిడి తగ్గడంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో ప్రభుత్వ యాజమాన్య బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) నికర లాభం ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ. 843.60 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 242.60 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 11,941.52 కోట్లకు పెరిగింది.

అంతకుముందు ఇదే కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 11,526.95 కోట్లుగా ఉండేదని బీవోఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇక, జూన్ 30 నాటికి బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 13.91 శాతానికి తగ్గడంతో బ్యాంకు ఫలితాల్లో మెరుగుదల ఉందని, అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్‌పీఏలు 16.50 శాతం ఉన్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో బ్యాంక్ తెలిపింది. అలాగే, నికర ఎన్‌పీఏలు 5.79 శాతం నుంచి 3.58 శాతానికి తగ్గాయి. ఫలితంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాడ్ లోన్స్ రూ. 766.62 కోట్లకు తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికానికి ఇవి రూ. 1,873.28 కోట్లుగా ఉండేవి.

Next Story