మహేశ్ బ్యాంకులో భారీగా అక్రమాలు

by  |
Mahesh Bank
X

దిశ, క్రైమ్ బ్యూరో: మహేష్ బ్యాంకులో బ్యాంకు డైరెక్టర్లే రూ.వందల కోట్లు గోల్‌మాల్ చేశారు. ఈ ఉదంతంపై స్వయంగా బ్యాంకు కార్యదర్శి, షేర్‌హోల్డర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ప్రకారం బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ బ్యాంకులో బోర్డు డైరెక్టర్లు, బోర్డు సభ్యులు, వారి కుటుంబ సభ్యులెవరూ కూడా రుణాలు తీసుకోకూడదంటూ తీర్మానం చేసుకున్నారు. దానికి విరుద్ధంగా రమేష్ కుమార్, ఉమేష్ చంద్ర, పురుషోత్తం దాస్‌లు తమ కుటుంబ సభ్యుల పేరిట రుణాలు పొంది అక్రమాలకు పాల్పడ్డారని బ్యాంకు కార్యదర్శి శ్యాంసుందర్ బియానీ ఫిర్యాదు చేశారు. 2016 ఫిబ్రవరి 24న నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు డైరెక్టర్లతో పాటు మరొకరు రూ.3.70 కోట్ల రుణం పొందినట్టుగా కార్యదర్శి శ్యామ్ సుందర్ గుర్తించారు.

ఈ రుణాలన్నీ వక్ఫ్ భూములు, అసలు భూములు లేకున్నా.. ఉన్నట్టుగా ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి 2018 మార్చి 19 నాటికి రూ.20.73 కోట్ల రుణాలు పొందినట్టు శ్యామ్ సుందర్ నాంపల్లి మూడవ ఏసీఎంఎం కోర్టును ఆశ్రయించారు. ఏజెంట్లతో కుమ్మక్కై 2-10 శాతం కమీషన్ పొందుతూ మరో రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారన్నారు. రూ.19 కోట్లతో నిర్మాణం కావాల్సిన బ్యాంకు భవనానికి రూ.37.30 కోట్లు అవుతున్నట్టుగా తప్పుడు లెక్కలు చూపించారని ఆరోపించారు. తప్పుడు బిల్లులతో 2018-19లో రూ.3 కోట్లు, 2019-20 లో రూ.3.50 కోట్లు కాజేసినట్టు తెలిపారు. మొత్తం రూ.345.53 కోట్ల మోసానికి పాల్పడిన బ్యాంకు డైరెక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్యదర్శి శ్యామ్ సుందర్ ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కళింగరావు తెలిపారు.



Next Story

Most Viewed