ఖమ్మంలో బీజేపీ క్రేజ్ పెరగడానికి కారణం ఇదేనా!

by  |
Bandi Sanjay, Minister Ajay, Khammam
X

దిశ‌, ఖ‌మ్మం: ఖ‌మ్మం ఖిల్లాపై పాగా వేసేందుకు కాషాయ నేతలు సమాయాత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ ఖ‌మ్మం ప‌ర్యట‌న కొచ్చిన‌ప్పుడ‌ల్లా మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌ను టార్గెట్ చేసుకుంటూ పావులు క‌దువుతున్నారు. తాజాగా సోమ‌వారం రాత్రి ఖ‌మ్మం జిల్లా కేంద్రంలో ప‌ట్టభ‌ద్రుల ఆత్మీయ స‌భ‌లో బండి సంజ‌య్ మంత్రి పువ్వాడ అజ‌య్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. మంత్రినే హెచ్చరించారు. ‘‘బిడ్డా నీ సంగ‌తి చూస్తా.. నీ భూ క‌బ్జా చిట్టా త‌న వ‌ద్ద ఉంది’’ అంటూ విమ‌ర్శలు చేశారు. బండి సంజ‌య్ మంత్రిపై మాట్లాడిన తీరుపై ఖ‌మ్మంలో హాట్ టాపిక్‌గా మారింది. బండి సంజ‌య్ దూకుడును ప్రదర్శిస్తూ భావజాల పరంగా కొన్ని వర్గాలను ఆకర్షించడం.. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ విఫ‌ల‌మైన చోట ప్రజ‌ల త‌ర‌వున తాము ప్రశ్నించ‌డానికి ఉన్నామన్న ప్రయత్నం చేస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాలో బండి సంజ‌య్ రెండు సార్లు ప‌ర్యట‌న‌లో టీఆర్ఎస్ ప్రభుత్వ ప‌నితీరు, మంత్రి భూ క‌బ్జాల వ్యవ‌హారాన్నే టార్గెట్ చేసుకుంటా ముందుకు సాగుతున్నాడు. జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వ ప‌నితీరుకు వ్యతిరేకంగా బీజేపీ ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేప‌ట్టింది.

ముఖ్యంగా త్రీటౌన్ గోళ్లపాడు నిర్వాసితుల విషయంలో బీజేపీ వేగంగా స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడడంలో చొరవ చూపింది. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఎంఎల్‌ పార్టీలు తేరుకుని గోళ్లపాడు నిర్వాసితుల సమస్యను ఓన్‌ చేసుకునేలోగా వారికి సత్వర న్యాయం చేయడానికి జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి నేరుగా పర్యటించడం.. బాధితులతో మాట్లాడడం.. బాధ్యులైన ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసి మరీ ఢిల్లీ పిలిపించి చివాట్లు పెట్టడమే ఖమ్మంలో బీజేపీ క్రేజ్‌ను పెంచిందనే చెప్పొచ్చు. ఈ సమస్యను పరిష్కరించడంలో అంతిమంగా స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన మంత్రి అజయ్‌కుమార్‌ చొరవ చూపినప్పటికీ అప్పటికే ఈ విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్‌సీ విష‌యంపై క‌లెక్టరేట్ ముట్టడి పిలుపు కూడా స‌క్సెస్ చేసి ఉద్యోగుల‌కు మేమున్నామంటూ భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌, వంద రోజులకు పైగా రిజిస్ట్రేషన్లు నిలుపుదల, సుబాబుల్‌ రైతులకు గిట్టుబాటు ధర విషయంలో బీజేపీ తన పంథాలో దూకుడుగా స్పందించి ఎప్పటికప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలతో ప్రజల మధ్యనే ఉంటున్న భావనను కల్పించగలిగింది.

మంత్రినే టార్గెట్ చేస్తూ విమ‌ర్శలు..

ఖ‌మ్మం జిల్లాలో బండి సంజయ్ ప‌ర్యట‌న అంటే ప్రతిఒక్కరూ ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. ప‌ర్యట‌న‌లో ప్రభుత్వం, మంత్రిపై చేసే కామెంట్ జిల్లాలో చ‌ర్చనీయాంశంగా మారడానికి దారితీస్తుంది. మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ ప్రభుత్వ భూములు క‌బ్జా చేస్తున్నాడ‌ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రశ్నించే వారిపై దాడులు అక్రమ కేసులు పెడుతున్నట్లు బండి సంజ‌య్ విమ‌ర్శలు చేశారు. బండి సంజ‌య్ చేసిన విమ‌ర్శపై టీఆర్ఎస్ నేత‌లు స్పందించినా.. ప్రజ‌లు న‌మ్మేస్థితిలో లేర‌ని తెలుస్తోంది. గతంలో బండి సంజ‌య్ ఖ‌మ్మం ప‌ర్యట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు మంత్రిపై ఘాటుగా మాట్లాడారు. అదే స్థాయిలో టీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శంచిలేక‌పోయారు. మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ అంత‌ర్గత విష‌యాల‌ను బీజేపీ పెద్దల‌కు లీక్‌లు ఇస్తున్నారు. అందుకే నీ చిట్టా నా వ‌ద్ద ఉంంటూ బ‌హిరంగంగానే చెప్పారు. మీ పార్టీ నేత‌లే నాకు చెప్పారంటూ వెల్లడించడం తీవ్ర చ‌ర్చకు దారి తీసింది. అస‌లు మంత్రి విష‌యాలు భ‌య‌ట ఏవ‌రు లీక్ చేస్తున్నారో అని మంత్రి అనుచ‌రులు చ‌ర్చించుకుంటున్నారు. జిల్లా బీజేపీ, ఖమ్మం, వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు, గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలను టార్గెట్‌ చేసుకుంటూ బీజేపీ తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ దూకుడుకు చేస్తున్న ప్రయ‌త్నాలు ఫ‌లిస్తాయోలేదో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed