‘మోడీ ప్రకటనతో కేసీఆర్, కేటీఆర్‌లకు భారీ షాక్’

by  |
‘మోడీ ప్రకటనతో కేసీఆర్, కేటీఆర్‌లకు భారీ షాక్’
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం టీకా ఫ్రీ ప్రకటనలో తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ లు షాక్ అయినట్లుందని, టీకా పేరు చెప్పి రూ.2500 కోట్లలో కమిషన్ తీసుకుందామంటే ప్రధాని నిర్ణయంతో మిస్ అయ్యాయన్న బాధలో ఉన్నట్లుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం విలేకరులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఈనెలలో 20 లక్షలు, జూలైలో 20 లక్షలు, ఆగస్టులో 30 లక్షల వ్యాక్సిన్లు రాబోతున్నాయన్నారు. 125 రోజుల్లో 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయగలిగింది భారత్ ఒక్కటే అన్నారు. 18 ఏళ్లు నిండిన దేశ ప్రజలందరికీ ప్రీ టీకా వేస్తామని ప్రకటించిన ప్రదాని మోదీకి ప్రజలతో పాటు మేధావులు, వైద్య నిపుణులు, సామాజిక వేత్తలు, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఒడిస్సా సీఎంలు సైతం బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారన్నారు.

కానీ, తెలంగాణ సీఎంకు థ్యాంక్స్ చెప్పాలన్న కనీస సంస్కారం లేదన్నారు. ఫ్రీ టీకాతో రాష్ట్రానికి రూ.2500 కోట్లు మిగిలిపోతున్నాయని, ఈ డబ్బుతో వైద్య సిబ్బంది భర్తీతో పాటు దవాఖానల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఫ్రీ వ్యాక్సిన్ పై దేశమంతా హర్షిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇన్నాళ్లు వ్యాక్సిన్‌పై చేసిన ఆరోపణలు అబద్దాలని తేలియన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన 80 లక్షల టీకాలను ప్రజలకు వేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. త్వరలోనే రోజుకు లక్ష టీకాలు వస్తాయని వాటిని వేయాలంటే కనీసం 5వేలకు తగ్గకుండా డాక్టర్లు, నర్సులు అవసరమని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలో, కోవిడ్ చికిత్సలో అన్నింటిలో ఫెయిల్ అయిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాక్సినేషన్ కు తగిన ఏర్పాటు చేయాలన్నారు.

వ్యాక్సిన్‌పై మంత్రులకు అవగాహన లేదు..

వ్యాక్సిన్‌పై మంత్రులకు ఏ మాత్రం అవగాహన లేదని, అందుకే తోచిన విధంగా మాట్లాడుతున్నారని సంజయ్ దుయ్యబట్టారు. కేటీఆర్ ట్విట్టర్ లో, హరీష్ రావు సిద్దిపేటలో కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని.. మీరు రాజకీయాలు తప్ప ప్రజల బతుకుల గురించి ఏనాడూ ఆలోచించలేదన్నారు. వ్యాక్సిన్ రాజకీయాలు మాని వ్యాక్సినేషన్ ను ఎలా విజయవంతం చేయాలో ఆలోచించాలని సూచించారు. ప్రజా సంక్షేమం కోసం రాత్రింభవళ్లు ఆలోచించే వ్యక్తి మోదీ అన్నారు. ఐసీఎంఆర్, సీఎస్ఐఆర్, ఇండియన్ ఇమ్యూనోలాజీ డిపార్ట్ మెంట్లతో కూడిన టాస్క్ ఫోర్స్ వ్యాక్సిన్ పైనా, కరోనా కట్టడిపైనా పరిశోధనలు చేసిందని, దాదాపు రూ.1500 కోట్లు 2020 ఏప్రిల్లోనే రిలీజ్ చేశారన్నారు. 70 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా కేవలం ఒక్క ఏడాదిలోనే స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సీన్ తయారు చేయించిన వ్యక్తి ప్రధాని మోడీ అన్నారు. గ్లోబల్ టెండర్లతోనే తెలంగాణ ప్రభుత్వం డ్రామాలు చేస్తుందని ఆరోపించారు.

ఒక్క డోస్ ఫైజర్ వ్యాక్సిన్ రేటు రూ. 2 వేల 880 లు అని, దేశంలోనే 90 కోట్ల మందికి రెండు డోసులు వేస్తే… కనీసం 7 లక్షల కోట్లకు పైగా ఖర్చవుతుందని, ఇప్పుడు కేవలం రూ.35 వేల కోట్లతో దేశ ప్రజలందరికి కేంద్రం వ్యాక్సిన్ వేయించగలుగుతోందని తెలిపారు. వ్యాక్సినేషన్ లో భరత్ 3వ స్థానంలో ఉంది… త్వరలోనే నంబర్ 1 స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా పేదలకు ప్రతి ఒక్కరికి 5 కిలో బియ్యం ఇవ్వాలన్న నిర్ణయాన్ని దీపావళి వరకు పెంచాలనుకోవడం చాలా గొప్ప నిర్ణయం అన్నారు. వలస కార్మికుల కోసం ఈ సారి బడ్జెట్ లో అదనంగా రూ.40 కోట్లు కేటాయించింది కేంద్రమే అన్నారు.

Next Story

Most Viewed