విషప్రచారం చేశారు.. కాంగ్రెస్ పై బండి ఫైర్

by  |
bandi-sanjay-12
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 2023లో జరగబోయే ఎలక్షన్స్‌లో గెలుపే లక్ష్యంగా మిషన్-19 పేరుతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలోని 19 అసెంబ్లీ ఎస్సీ రిజర్వ్ స్థానాలు, 3 పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్ స్థానాల నియోజకవర్గాలపై ఆర్గనైజింగ్ వర్క్ షాపును హోటల్ కట్రియాలో బండి సంజయ్‌ అధ్యక్షతన ఏర్పాటుచేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ వర్క్ షాప్ కొనసాగుతుందని తెలిపారు. ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా మిషన్-19 పేరుతో ఈ సమీక్ష నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ శక్తివంతమైన పార్టీగా అవతరించిందని అన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ విఫలమైందని, ఇప్పుడు దళితులంతా బీజేపీ వైపు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని తెలిపారు.

బీజేపీ మొదటి నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు, శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తుందని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ విషప్రచారం చేసిందని, రాజ్యాంగాన్ని మారుస్తారని, దళిత చట్టాలను నీరుగారుస్తున్నామని దుష్ప్రచారం చేసిందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అయినా దేశ ప్రజలు కాంగ్రెస్ ను ఏ మాత్రం నమ్మడం లేదన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా 46 ఎస్సీ నియోజకవర్గాలను గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ (5) కే పరిమితమైందని ఎద్దేవా చేశారు.

కేంద్ర పథకాలను జనంలోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని, ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో సమస్యలను గుర్తించి అందుకు అనుగుణంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని అన్నారు.

Next Story

Most Viewed