కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కు షాక్.. తలనొప్పి తెచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

by  |
కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కు షాక్.. తలనొప్పి తెచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కు షాక్ తగిలింది. మహబూబ్ నగర్ పర్యటన వివాదాలు తెచ్చిపెట్టింది. ఈ ఇద్దరు నేతలతోపాటు, మహబూబ్ నగర్ కలెక్టర్ పై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కి ఫిర్యాదు చేశారు టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బ‌క్క‌ జ‌డ్స‌న్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చిన్న‌చూపు చూస్తోంద‌ని టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బ‌క్క‌ జ‌డ్స‌న్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రంలో క‌ల్వ‌కుంట్ల కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు మంత్రులు, కొంత‌మంది ఉన్న‌తాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని మండిపడ్డారు. ఈనెల 12న‌ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ల మెప్పు పొందేందుకు స్థానిక మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అంగ‌న్‌వాడీ మ‌హిళా ఉద్యోగుల‌ను మూడు గంట‌ల పాటు ఎండ‌లో నిలెబెట్టార‌ని ఆరోపించారు.

అంగ‌న్‌వాడీ మ‌హిళా ఉద్యోగినుల్లో అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌ర్గాల‌కు చెందిన వారే ఉంటార‌ని జడ్సన్ పేర్కొన్నారు. ఎండ‌లో నిల‌బ‌డి మంత్రి కేటీఆర్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌కుంటే మీ ఉద్యోగాలు ఉండ‌వు అంటూ మంత్రి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డార‌ని సంచలన ఆరోపణలు చేశారు. కొంత‌మంది మ‌హిళా ఉద్యోగినులు చంటిపిల్ల‌ల‌తో కూడా ఎండ‌లో నిల‌బ‌డ్డార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. కేవ‌లం మంత్రికి స్వాగతం ప‌ల‌క‌డానికి ఇంత ఆర్భాట‌మా అంటూ జ‌డ్స‌న్.. అధికార పార్టీ నాయకులను నిలదీశారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబీకుల‌కు ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికి.. ప్ర‌స‌న్నం చేసుకునేందుకు స్థానిక క‌లెక్ట‌ర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్య‌వ‌హ‌రించిన‌ తీరు సిగ్గుచేట‌ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

క‌ల్వ‌కుంట్ల కుటుంబం నిజాం రాజు వ‌లె ఈ రాష్ట్రాన్ని పాలించాల‌ని భావిస్తున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంద‌ని అన్నారు. తెలంగాణ‌లో రాచ‌రిక పాల‌న న‌డుస్తోంద‌నడానికి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన సంఘ‌ట‌నే సాక్ష్య‌మ‌ని అన్నారు. మ‌హిళ‌ల‌ను ఎండ‌లో నిల‌బెట్ట‌డం ఖ‌చ్చితంగా మాన‌వ‌హ‌క్కుల ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుంద‌ని జ‌డ్స‌న్ పేర్కొన్నారు. మ‌హ‌బూబున‌గ‌ర్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై బుధ‌వారం జాతీయ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌కు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క‌లెక్ట‌ర్‌పై చ‌ర్య‌లు కోరుతూ ఫిర్యాదు చేసిన‌ట్లుగా ఆయన ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Follow Dishadaily Official Facebook page https://www.facebook.com/dishatelugunews
Next Story

Most Viewed