ఎలక్ట్రానిక్ వాహన మార్కెట్లోకి బజాజ్ ఆటో..

by  |
business news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. గురువారం జరిగిన సంస్థ కార్యక్రమంలో పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థను ఏర్పాటు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. “ఎలక్ట్రిక్ వాహనాల విభాగాన్ని అనుబంధ సంస్థగా మార్చడం ద్వారా మొబిలిటీ మార్కెట్లో మరింత వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. టూ-వీలర్, త్రీ-వీలర్, కార్ల విభాగంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ ఈ విభాగంలో జరుతుందని” కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అనుబంధ సంస్థగా ప్రారంభించబోయే విభాగానికి పేరు ఇంకా ఖరారు చేయలేదని, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదానికి లోబడి ఇది ఉంటుందని, అనుబంధ సంస్థకు మూలధంగా రూ. 100 కోట్లను ఉంచనున్నట్టు కంపెనీ వివరించింది.

బజాజ్ ఆటో ఇప్పటికే చేతక్ మోడల్‌లో ఎలక్ట్రిక్ వాహనాన్ని విక్రయిస్తోంది. 2021-22లో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, క్వాడ్రిసైకిళ్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ప్రత్యామ్నాయంగా బజాజ్ ఆటో ప్రీమియం బైక్ బ్రాండ్ కేటీఎమ్‌ను కూడా ఎలక్ట్రిక్ విభాగంలో తీసుకురావాలని భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఇప్పటికే హీరో మోటోకార్ప్, టీవీఎస్ కంపెనీలు పెట్టుబడులను ప్రారంభించాయి. ఓలా, ఎలక్ట్రిక్, ఆథర్ ఎనర్జీ, రివోల్ట్ లాంటి స్టార్టప్ కంపెనీలు ఈ మార్కెట్లో గణనీయమైన డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బజాజ్ ఆటో ప్రకటన విడుదల కావడం గమనార్హం. కాగా, గురువారం బజాజ్ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 20 శాతం తగ్గి రూ. 1,061 కోట్లుగా వెల్లడించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 139.88 శాతం పెరిగి రూ. 7,386 కోట్లకు చేరుకుంది. సెకెండ్ వేవ్ కరోనా ప్రభావం కారణంగా సంస్థ లాభాలను దెబ్బతిన్నాయని కంపెనీ అభిప్రాయపడింది.



Next Story

Most Viewed