ఎస్ఈసీ మార్పుపై బాబు, యనమల ఆగ్రహం

by  |
ఎస్ఈసీ మార్పుపై బాబు, యనమల ఆగ్రహం
X

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌తో పాటు ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఆమోదించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఈ-మెయిల్ ద్వారా లేఖ రాశారు.

ఆ లేఖలోని వివరాల్లోకి వెళ్తే… “రాజ్యాంగంలో 243 (కె) నిబంధన ప్రకారం 2016లో ఎస్ఈసీని నియమించారు. ఐదేళ్ల కాలవ్యవధికి నియమితులైన ఆయనను ఇప్పుడు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తొలగించడం సరికాదు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషనర్‌ను దొడ్డిదారిన మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?. అర్ధాంతరంగా ఎస్ఈసీని మార్చడం అనైతికం, చట్టవిరుద్ధం. ఏ నిబంధన అయినా పదవీకాలం ముగిశాకే అమలు చేయాలి”. అని చెబుతూ, తాజా ఆర్డినెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు.

ఇదే అంశంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, హైకోర్టు జడ్జిని తొలగించే విధానమే ఎస్ఈసీకి కూడా వర్తిస్తుందని అన్నారు. లేని అధికారాన్ని చెలాయించి, ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గించాలని చూడడం హేయమైన చర్య అని తూర్పారపట్టారు. పంచాయతీరాజ్ చట్ట సవరణలు రాజ్యాంగ పరిధిలోనే జరగాలని ఆయన అన్నారు.

Tags: andhra pradesh, ssc, state election commissioner, chandrababu, yanamala, tdp



Next Story