విప్రో అధినేత రోజుకు రూ. 27 కోట్ల విరాళం

by  |
Azim Premji
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ వరుసగా రెండో ఏడాది దాతృత్వంలో మేటిగా నిలిచారు. రోజుకు రూ. 27 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం రూ. 9.713 కోట్లను విరాళంగా ఇచ్చారు. దీంతో 2020-21కి గాను ఎడెల్‌గివ్ ఫౌండేషన్, హురున్ రిపోర్ట్ ఇండియా రూపొందించిన దాతృత్వ జాబితాలో వరుసగా రెండోసారి అజీమ్ ప్రేమ్‌జీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆయన తర్వాత హెచ్‌సీఎల్‌కి చెందిన శివ్ నాడార్ రూ. 1,263 కోట్ల విరాళం అందించి రెండో స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రూ. 577 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో శివ్ నాడార్ రూ. 795 కోట్లు, ముఖేశ్ అంబానీ రూ. రూ. 458 కోట్లను విరాళంగా ఇచ్చారు.

ఇక, భారత రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ రూ. 130 కోట్ల విరాళం ఇచ్చి ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నందన్ నీలేకని రూ. 183 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. ఈ జాబితా ప్రకారం.. భారత్‌లో 11 మంది వ్యక్తులు రూ. 100 కోట్లకు పైగా, 20 మంది రూ. 50 కోట్లకు పైగా, 42 మంది రూ. 20 కోట్లకు పైగా విరాళాలను ఇచ్చారు. ఎల్అండ్‌టీ మాజీ చైర్మన్ యామ్ నాయక్ రూ. 112 కోట్లను విరాళం అందించి ఈ జాబితాలో చోటు సంపాదించారు.

హెటెరో డ్రగ్స్‌కు చెందిన బి. పార్థసారథి కుటుంబం విరాళం 300 శాతం పెరిగి రూ. 67 కోట్లకు చేరిందని నివేదిక తెలిపింది. ఇక, స్టాక్ మార్కెట్ల బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రూ. 50 కోట్ల విరాళంతో ఈ జాబితాలోకి చేరారు. ఈ లిస్ట్‌లో తొమ్మిది మంది మహిళలు ఉన్నారని నివేదిక తెలిపంది. రూ.69 కోట్లతో రోహిణి నీలేకని ఈ జాబితాలో అత్యధిక విరాళం ఇచ్చారు. గత మూడేళ్లలో రూ. 10 కోట్ల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన వారు 100 శాతం పెరిగి 37 నుంచి 72 మందికి పెరిగారు.

Next Story

Most Viewed