ఆయుష్మాన్​ భారత్‌ను గ్రామ స్థాయికి విస్తరించాలి..

by  |
ఆయుష్మాన్​ భారత్‌ను గ్రామ స్థాయికి విస్తరించాలి..
X

దిశ, తెలంగాణ బ్యూరో : పేద ప్రజల ఆరోగ్య సంరక్షిణి, దేశ వ్యాప్తంగా పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను జాతీయ బీసీ సంఘం అధికార ప్రతినిధి దాసు సురేష్​అభినందించారు. అదే క్రమంలో ప్రస్తుతం కోవిడ్ తీవ్రత వాడవాడలా బెంబేలేత్తిస్తున్న కారణంగా ఈ పథకాన్ని గ్రామస్థాయికి చేరే విధంగా ప్రత్యేక కమిటీని నియమించాలని కోరారు. ఈ మధ్యకాలంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించిన వందల మంది టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కోవిడ్ బారినపడ్డారన్నారు.

అందులో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు. అలాంటి కుటుంబంలోని ఒకరికి సమాన స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తూ రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. ప్రభుత్వ విధి నిర్వహణలో కోవిడ్ బారిన పడ్డ ప్రభుత్వ ఉద్యోగులు, ఆశావర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల పూర్తి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించేలా జీఓను జారీ చేయాలన్నారు.

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు, అసంఘటిత కార్మికులకు, చేనేత, చేతివృత్తి దారులకు రూ.5 వేల భృతిని అందించాలన్నారు. లాక్‌డౌన్‌తో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఇంటి కిరాయిలు, స్కూల్ ఫీజులు, ఫైనాన్స్ కిస్తీల కోసం ప్రైవేట్ సంస్థలు పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలన్నారు. కరోనా చికిత్స కోసం 50 శాతం ప్రైవేట్ ఆసుపత్రి బెడ్లను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలన్నారు.

రైతు బంధును మూడు ఎకరాలకు మించిన వారికి నిలిపివేసి, ప్రస్తుతం అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలన్నారు. 33 జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లకు విస్తృత అధికారాలందించి వారి ఆధ్వర్యంలో కోవిడ్ వార్ రూమ్‌లు ఏర్పాటుచేసి అందుబాటులో ఉన్న మెడిసిన్, వెంటిలేటర్లు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ పడకల డ్యాష్ బోర్డులను ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలన్నారు.

Next Story

Most Viewed