ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్‌లల్లా మారిపోయారు : శిల్పి అరుణ్ యోగిరాజ్

by Dishanational4 |
ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్‌లల్లా మారిపోయారు : శిల్పి అరుణ్ యోగిరాజ్
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య బాలక్‌రామ్ విగ్రహమూర్తిని రూపుదిద్దిన ప్రక్రియ గురించి మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆసక్తికర వివరాలను వెల్లడించారు. రామమందిరం గర్భగుడిలో అలంకరణ చేసిన తర్వాత రామ్‌లల్లా పూర్తిగా భిన్నంగా కనిపించారని చెప్పారు. ఆ దేవతామూర్తిని చెక్కింది నేనేనా అనే సందేహం వచ్చిందన్నారు. ఓ మీడియా సంస్థతో అరుణ్ యోగిరాజ్ మాట్లాడుతూ.. గర్భగుడిలో కొలువుతీరిన అయోధ్య రామయ్యను దర్శించుకున్న తర్వాత తన మనసులో కలిగిన భావాలను వ్యక్తీకరించారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామయ్య మహిమను చూపించి.. తన రూపాన్ని మార్చుకున్నారని అనిపించిందన్నారు. ‘‘అయోధ్య రాముడి విగ్రహాన్ని శిల్ప శాస్త్రానికి అనుగుణంగా తయారు చేశాను. ఐదు సంవత్సరాల రాముడి రూపం కనిపించేలా రూపొందించాను. పిల్లల అమాయకత్వం ఈ విగ్రహ మూర్తిలో స్పష్టంగా కనిపిస్తుంది’’ అని ఆయన వివరించారు. విగ్రహాన్ని తయారు చేసిన గత ఏడు నెలల టైం తనకు పెద్దసవాలుగా నిలిచిందన్నారు. ‘‘రామ్ లల్లా కళ్లు బాగున్నాయా అని తరుచూ నేను నా స్నేహితులను అడిగేవాడిని. ఒక శిలలో భావోద్వేగం కనిపించేలా చేయడం అంత ఈజీ కాదు. దానితో శిల్పి చాలా సమయం గడపాల్సి ఉంటుంది. అందుకోసం నేను చాలా హోంవర్క్ చేశాను. పిల్లల ప్రవర్తనను, హావభావాలను అధ్యయనం నిశితంగా పరిశీలించాను. మిగతా పనంతా రామ్ లల్లా ఆదేశంతో జరిగిపోయింది’’ అని శిల్పి అరుణ్ యోగిరాజ్ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed