బాహుబలి రికార్డుకు చేరువలో ‘అయోధ్య’ కలెక్షన్స్!

by  |
బాహుబలి రికార్డుకు చేరువలో ‘అయోధ్య’ కలెక్షన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ హిట్ సినిమా అంటే అది సాధించిన కలెక్షన్లనే అందుకు ఉదాహరణగా చెప్పుకుంటారు. అయితే, టాలీవుడ్‌లో ప్రస్తుతం బాహుబలి, నాన్ బాహుబలి రికార్డులుగా డివైడ్ చేసి చెప్పుకుంటున్నారు. అందుకు కారణం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్‌ పార్టులు భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటాయి. అప్పటివరకు మనదేశంలో సినిమా అంటే బాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే ప్రపంచం గుర్తించేది.

బాహుబలి రిలీజ్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లడమే కాకుండా, సౌత్ ఇండస్ట్రీ సత్తా ఎంటో బాలీవుడ్ దిగ్గజాలకు కూడా అర్థమైందని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇండియన్ హిస్టరీలో అప్పటివరకు కలెక్షన్ల పరంగా టాప్‌లో కొనసాగుతున్న షారుక్, సల్మాన్, అమిర్ ‘ఖాన్‌’ త్రయం సినీ రికార్డులను బాహుబలి ఒక్కదెబ్బతో చెరిపివేసింది. 2017లో రిలీజ్ అయిన బాహుబలి ది కన్ క్లూజన్ ఓవరాల్‌గా రూ.1000కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి హిస్టరీ మేకర్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో అప్పటివరకు టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారంటే ఆ ఘనత కూడా బాహుబలికే దక్కుతుందని చెప్పవచ్చు.

అయితే, ఇండియాలో కలెక్షన్ల పరంగా రికార్డు క్రియేట్ చేసిన బాహుబలి రికార్డులు బద్దలవ్వనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాహుబలిని తలదన్నే రేంజ్‌లో మరో కొత్త మూవీ రానుందా..? అందులో ఎవరు హీరో..? ఈసారి ఆ రికార్డు క్రియేట్ చేసేది టాలీవుడ్ ఇండస్ట్రీనా లేదా బాలీవుడ్ ఇండస్ట్రీనా అనే పలు అనుమానాలు సైతం వ్యక్తం కావచ్చు. అయితే, ఈసారి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించడం మాత్రం ఖాయం కావొచ్చు. కానీ, అది ముమ్మాటికీ సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం కాదు. మరెలా అనుకుంటున్నారా.. అయోధ్య రామమందిరానికి విరాళాల రూపంలో వచ్చే కలెక్షన్లే అందుకు ఉదాహరణగా చెప్పుకొవచ్చు.

అయోధ్య రామమందిరం.. దేశంలోని కోట్లాది మంది హిందువుల కలగా దీనిని అభివర్ణిస్తుంటారు.. అదొక సెంటిమెంట్.. యూపీలోని అయోధ్యను రాముడి జన్మభూమిగా భావిస్తారు. గతంలో అక్కడున్న రామమందిరాన్ని కూల్చి అక్కడ బాబ్రీ మసీదు నిర్మాణం చేపట్టారని వివాదం చెలరేగింది.1992 నుంచి ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న ఐదెకరాల స్థలం కోసం అటు హిందూ సంఘాలు, ఇటు ముస్లిం మతపెద్దలు ఎన్నో ఏండ్లుగా ఈ స్థలం తమకంటే తమకే చెందాలంటూ వాదిస్తున్నారు. చివరగా 2019 ఆగస్టులో సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆ స్థలాన్ని రాముడి జన్మస్థలంగా తీర్పు వెలువరించారు. దానికి ప్రతిగా మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే ఐదెకరాల స్థలం కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో దశాబ్దాలుగా రెండు కమ్యూనిటీల మధ్య రగులుతున్న వివాదానికి ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లు అయింది. దీంతో అక్కడ రామమందిరం నిర్మాణానికి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఇటీవల ప్రధాని మోడీ చేతుల మీదుగా రామమందిరం నిర్మాణానికి భూమిపూజ కూడా నిర్వహించారు.

ఆ తర్వాత జనవరి 15 నుంచి దేశవ్యాప్తంగా స్వచ్ఛంద విరాళాలు అందివ్వాలని రామజన్మభూమి ట్రస్ట్ పిలుపునిచ్చింది. దీంతో దేశంలోని బడా పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మెన్స్, నార్మల్ పీపుల్‌తో పాటు హిందూసంఘాలు భారీ స్థాయిలో విరాళాలు ప్రకటించాయి. నాటి నుంచి మొదలైన డోనెషన్స్ కేవలం 20 రోజుల వ్యవధిలోనే రూ.600 కోట్లు వచ్చాయని రామ జన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. అయితే, ఫిబ్రవరి 27వరకు ఈ విరాళాల సేకరణ క్యాంపెనింగ్ కొనసాగనుంది. కేవలం 20 రోజుల్లో రూ.600 కోట్ల విరాళాలు వస్తే.. మరో 17రోజుల్లో ఇంకొక రూ.500 కోట్లు డోనెషన్స్ వచ్చే అవకాశం లేకపోలేదని ట్రస్ట్ సభ్యులు భావిస్తున్నారు. అదే జరిగితే ఇండియాలో బాహుబలి నెలకొల్పిన రూ.1000 కోట్ల కలెక్షన్ రికార్డులను ‘అయోధ్య రాముడు’ బద్దలుకొట్టినా ఆశ్చర్యపోనక్కలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన ఘనత తిరుమల శ్రీవారి తర్వాత అయోధ్య రామచంద్రుడికే దక్కుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement
Next Story

Most Viewed