యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రూ. 1,683 కోట్లు

by  |
యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రూ. 1,683 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ అతిపెద్ద ప్రైవేట్ దిగ్గజ యాక్సిస్ బ్యాంక్ రూ. 1,682.67 కోట్ల నికర లాభాలను నివేదించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 112.08 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ. 7,326 కోట్లకు చేరుకుందని, నికర వడ్డీ మార్జిన్ 3.58 శాతంగా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఈ త్రైమాసికంలో ఫీజుల ఆదాయం 4 శాతం పెరిగి రూ. 2,752 కోట్లకు, రిటైల్ ఫీజుల ఆదాయం 0.5 శాతం, కార్పొరేట్, వాణిజ్య బ్యాంకింగ్ ఫీజుల ఆదాయం 10 శాతం పెరిగినట్టు బ్యాంకు వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో బ్యాంకు నిర్వహణ లాభం 16 శాతం పెరిగి రూ. 6,898 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత ఏడాదిలో అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకు సుమారు రూ. 6,898 కోట్ల అదనపు కేటాయింపులను నమోదు చేసినట్టు పేర్కొంది.

యాక్సిస్ బ్యాంకు మారటోరియం కింద రుణాల కోసం రూ. 1,279 కోట్లు, పునరుద్ధరణ కోసం రూ. 1,864 కోట్లు మొత్తంగా రూ. 3,143 కోట్లను కేటాయించినట్టు తెలిపింది. ఈ త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏలు 4.18 శాతంగా ఉన్నాయి. గతేడాది ఇది 5.08 శాతంగా ఉందని, నికర ఎన్‌పీఏలు 0.98 శాతంగా నమోదయ్యాయని పేర్కొంది.


Next Story

Most Viewed