‘కూతురిలా చూసుకుంటే చంపాలని చూసింది’

by  |
‘కూతురిలా చూసుకుంటే చంపాలని చూసింది’
X

దిశ, ఏపీ బ్యూరో: తనను చంపేందుకు టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు సుపారీ ఇచ్చారని టీడీపీ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ప్రెస్‌మీట్లలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏవీ సుబ్బారెడ్డి శనివారం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకు ప్రయత్నించి అరెస్ట్ అయిన వారికి, భూమా అఖిలప్రియకు సంబంధం ఉందో? లేదో? చెప్పాలని డిమాండ్ చేశారు. అఖిలప్రియ తనకు సొంత కూతురు లాంటిదనీ, అలాంటి అఖిలప్రియనే తన హత్యకు కుట్రపన్నిందని పోలీసులు చెప్పడంతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. 30 ఏళ్లుగా భూమా కుటుంబానికి అండగా ఉన్నాననీ, బాంబు దాడులు జరుగుతున్న సమయంలో అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డిని భుజాలపై ఎత్తుకెళ్లి నామినేషన్ వేయించానని వెల్లడించారు. ఇక తాను కార్యకర్తలను ఎలా కాపాడుకుంటానో ఆళ్లగడ్డలో ఏ ఒక్క స్థానిక నేతను అడిగినా చెబుతారనీ, అలాంటి తనను చంపాల్సిన అవసరం ఎందుకొచ్చిందో అఖిలప్రియ చెప్పాలన్నారు. అఖిలప్రియలాంటి నేతలు ఉంటే మరెందరో చచ్చిపోతారని మండిపడ్డారు. అలాగే, అఖిల కోరుకున్నట్టుగానే ఆళ్లగడ్డలో తప్పకుండా రాజకీయం చేస్తాననీ, అయితే, ఆమె నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

అఖిలప్రియ భర్తకు నోటీసులు

ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడైన అఖిలప్రియ భర్త భార్గవ్‌కు కడప పోలీసులు నోటీసులు పంపించారు. విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. కాగా, భార్గవ్‌పై కడపకు చెందిన వారితో సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నినట్లుగా ఆరోపణలున్నాయి.

Next Story