బతుకు భారమైనా సేవను మరువని యువ ఆటోడ్రైవర్

by  |
బతుకు భారమైనా సేవను మరువని యువ ఆటోడ్రైవర్
X

దిశ, హుజూర్‌నగర్ : సేవ చేయాలనే దృఢమైన సంకల్పం ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించాడు సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణంలోని గోవిందపురం కాలనీకి చెందిన యువ ఆటోడ్రైవర్ ఎసుమళ్ల వెంకటేష్. ప్రస్తుతం కరోనా పాజిటివ్ వచ్చిన వారికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆ యువకుడు ముందుకొచ్చాడు. కరోనా బారిన పడిన వారిని హాస్పిటల్ నుండి ఇంటికి, ఇంటి నుండి హాస్పిటల్‌కు తీసుకు వెళుతూ తన దాతృత్వాన్ని చాటుతున్నాడు. అలాగే కరోనాతో మృతి చెందిన వారిని కూడా తన ఆటోలో స్మశానవాటికకు చేరవేస్తున్నాడు. ఇప్పటి వరకు 20 మంది పైగానే కరోన పేషెంట్లను హాస్పిటల్ నుండి ఇంటికి, ఇంటి నుండి హాస్పిటల్‌కు ఎటువంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా తీసుకు వచ్చానని తెలిపాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా సోకిన వ్యక్తి దగ్గరకు తన కుటుంబ సభ్యులు గానీ, సొంత బంధువులు గానీ వెళ్లాలంటే భయపడే పరిస్థితుల్లో తనకు ఏమీ కాని వారి కోసం తన సొంత ఆటోలో ఎటువంటి లాభం లేకుండా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా చేస్తున్న సేవను చూసి పలువురు అభినందిస్తున్నారు . కరోనా బారిన పడిన వ్యక్తులు తన ఫోన్ నెంబర్ 88853 51516 ఫోన్ చేస్తే తాను ఫ్రీగా సర్వీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెంకటేశ్ బదులిచ్చాడు.

వెంకటేష్ కుటుంబ నేపథ్యం..

వెంకటేశ్ నిరుపేద పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతనికి కుటుంబ పరంగా వచ్చిన ఆస్తులు అంటూ ఏవీ లేవు. అతని తండ్రి జగన్నాధం గత 6 సంవత్సరాల కిందట మద్యానికి బానిసై మరణించాడు. అప్పటి నుండి తన తల్లి తిరుపతమ్మ కూలి పనికి వెళ్లి కొడుకు చదివిస్తూ కూతురుకి పెళ్లి చేసింది. పెళ్లి సమయంలో కొంత అప్పు అవ్వగా దాన్ని తీర్చేందుకు తిరుపతమ్మ నానా కష్టాలు పడుతోంది. వెంకటేశాన్ని 6 తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రాజాంపేటలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివించింది తల్లి. తర్వాత, కోదాడలోని ఐటీఐ కాలేజీలో చదువుతుండగానే కొవిడ్ రావడంతో తన చదువుకు స్వస్తి చెప్పాడు. తల్లికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక ఫైనాన్స్ కంపెనీ ద్వారా ఆటోను తీసుకుని నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆటోలోనే కరోనా బారినపడిన వారికి సేవలందిస్తున్నాడు.

పేదరికం అంటే ఏంటో నాకు తెలుసు..

పేదరికం అంటే ఏమిటో నాకు తెలుసు.. ప్రస్తుతం కరోన సమయంలో డబ్బులున్న వారందరూ హైద్రాబాదు వెళ్లి పెద్ద హాస్పిటల్లో లక్షల ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నారు. మామూలు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వ, సాదాసీదా ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. వారిని ఆస్పత్రిలో తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నా ఆటోలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను సహాయం చేయాలని చేస్తున్నాను.

-యువ ఆటోడ్రైవర్ ఏసుమల్ల వెంకటేష్

Next Story

Most Viewed