65 శాతం పెరిగిన ఆటో కాంపొనెంట్ పరిశ్రమ టర్నోవర్!

by  |
Auto component industry
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వల్ల భారీగా దెబ్బతిన్న రంగాల్లో ఆటో కాంపొనెంట్ పరిశ్రమ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమకు ఇటీవలే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరోసారి భయపెడుతోంది. అయితే, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు మెరుగైన వృద్ధిని చూడగలమని పరిశ్రమ సంఘం ఆటోమోటివ్‌ కాంపోనెంట్‌ మ్యానుఫాక్చర్స్‌ అసోసియేషన్‌(ఏసీఎంఏ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2021-22 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఆటో కాంపొనెంట్ పరిశ్రమ రూ. 1.96 లక్షల కోట్ల టర్నోవర్ సాధించిందని, గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన దానికంటే 65 శాతం ఎక్కువని ఏసీఎంఏ పేర్కొంది. వాహనాల కొనుగోళ్లకు గిరాకీ పుంజుకున్నప్పటికీ సెమీకండక్టర్ల లభ్యత, పెరుగుతున్న ఇన్‌పుట్, లాజిస్టిక్ ఖర్చులు, కంటైనర్ల కొరత వంటి సరఫరా సమస్యలు పరిశ్రమ రికవరీకి ఆటంకం కలిగిస్తున్నాయని ఏసీఎంఏ అధ్యక్షుడు సంజయ్ కపూర్ అన్నారు. సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమ మెరుగ్గా రాణించిందని ఆయన తెలిపారు.

పండుగ సీజన్‌లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేనప్పటికీ రాబోయే నెలల్లో డిమాండ్ మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. దేశీయంగానే బ్యాటరీలు, విడి భాగాల తయారీ సామర్థ్యం పెరుగుతుండటం, ప్రభుత్వ పీఎల్ఐ పథకం లాంటి పరిణామాలు దీనికి దోహదపడనున్నాయని సంజయ్ వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఒరిజినల్ పరికరాల తయారీదారులు దేశీయంగా రూ. 1.53 లక్షల కోట్ల అమ్మకాలు సాధించారని, ఇది గతేడాదితో పోలిస్తే 76 శాతం అధికమని సంజయ్ కపూర్ వెల్లడించారు.



Next Story