నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యదర్శి పై దాడి..

by  |
నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యదర్శి పై దాడి..
X

దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్/మల్దకల్: వరుసగా ఆందోళన కార్యక్రమాలు.. దిష్టిబొమ్మ దగ్దాలతో గరం గరం గా ఉన్న గద్వాల నియోజకవర్గం మల్దకల్‌లో శుక్రవారం సాయంత్రం నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి లవన్న పై దాడి జరగడంతో రాజకీయ విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. వివరాల్లోకి వెళితే మల్దకల్ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున ఎద్దులు బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టి, భారీ ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి సభ్యులు సైతం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు.

ఫ్లెక్సీలను కొంతమంది చించివేయడంతో నడిగడ్డ పోరాట సమితి సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అధికార పార్టీకి చెందిన అజయ్, తన అనుచరులతో ఫ్లెక్సీలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అప్పుడు కేసు పెట్టడం కాదు, ఉన్న ఫ్లెక్సీలను కూడా చించిపాడెస్తం, నీ చేతనైంది చేసుకో అంటూ మిగిలిన ఫ్లెక్సీలను తీసివేసేందుకు ప్రయత్నించారు. అయితే ఫ్లెక్సీలను తొలగిస్తుండగా ఆ దృశ్యాలను అక్కడ ఉన్న ఇద్దరు సెల్ఫోన్లలో బంధిస్తూ ఉండగా వారిని బెదిరించి, గద్వాల్ కు తిరుగు పయనం అయ్యారు.

ఈ క్రమంలో మల్దకల్ వైపు వస్తున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి లవన్న వారి కనపడటంతో అతనిని అడ్డుకున్నారు. అజయ్, అతని అనుచరులు లవన్న పై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని చూసిన కొంతమంది గట్టిగా అరుస్తూ అక్కడికి చేరుకోవడంతో అజయ్, అతని అనుచరులు అక్కడి నుంచి తప్పించుకోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గాయపడ్డ వారి కంటే ముందుగానే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి సభ్యులు, కొంతమంది రైతులు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు. గాయపడ్డ లవన్న ను ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

Next Story