ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై అటాక్

by  |
Indian-Air-Force
X

శ్రీనగర్: జమ్ములోని భారత వైమానిక దళ స్టేషన్‌లో జంట పేలుళ్ల ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి(ఆదివారం తెల్లవారుజాము) ఉగ్రమూకలు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్‌తో పేలుడు పదార్థాలను ప్రయోగించాయి. ఎయిర్‌బేస్‌లోని హెలికాప్టర్లే లక్ష్యంగా దాడి చేసినట్టు అనుమానిస్తు్న్నారు. అదృష్టవశాత్తు వారి టార్గెట్ విఫలమైంది. హెలికాప్టర్లకు, ఆయుధ సామాగ్రికి నష్టం జరగలేదు. కానీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. భారత భద్రతా దళ సిబ్బంది కేంద్రాలపై డ్రోన్‌తో జరిగిన తొలి దాడిగా దీన్ని పేర్కొంటున్నారు. రాత్రి 1.37 నిమిషాలకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని హ్యాంగర్‌(ఎయిర్‌క్రాఫ్ట్‌లు నిలిపి ఉంచే నిర్మాణం)పై తొలి బాంబు పేలింది. దీంతో హ్యాంగర్ పైకప్పుకు డ్యామేజీ జరిగింది. మరో బాంబు 1.42 నిమిషాలకు ఓపెన్ ఏరియాలో పడింది. ఈ రెండు బాంబులు డ్రోన్ ద్వారానే ప్రయోగించారని, ప్రత్యక్షంగా ఇద్దరు చూసినట్టు రక్షణసంబంధ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో డ్రోన్ ద్వారా ఉగ్రమూకల దాడి జరగలేదు.

ఉగ్రవాదులు మారుమూల ప్రాంతంలో ఉండికూడా డ్రోన్‌ల ద్వారా టార్గెట్‌ను పేల్చేయడం సాధ్యపడుతుంది. కాబట్టి, ఇలాంటి దాడిపై డిఫెన్స్‌వర్గాల్లో ఆందోళన వెలువడుతున్నది. ఈ ఘటనకు సంబంధించి ఉపా చట్టంలోని సెక్షన్ 16, 18ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. సమీప ప్రాంతం సత్వారి నుంచి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశంలో అధికార పర్యటనలో ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ ఇంటర్నల్ అసెస్‌మెంట్‌తోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టీమ్ ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీమ్, స్పెషల్ ఫోర్స్ టీమ్‌లూ రంగంలోకి దిగాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైస్ ఎయిర్ చీఫ్, ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరాలతో ఘటనపై మాట్లాడారు. ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ జమ్ముకు వెళ్తున్నట్టు డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫీస్ ట్వీట్ చేసింది.


Next Story

Most Viewed