భగ్గుమంటున్న బెంగాల్.. బీజేపీ, సీపీఎం కార్యకర్తలపై దాడులు

by  |
Attack, West Bengal
X

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన అనంతరం అక్కడ రాజకీయ హింస పెట్రేగుతున్నది. ఫలితాల తర్వాత అక్కడ బీజేపీ, సీపీఐ(ఎం) ఆఫీసులు, కార్యకర్తల మీద దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మే 2న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున రాత్రి కూచ్‌బెహార్‌లోని బీజేపీ ఆఫీసును పలువురు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి ధ్వంసం చేయగా.. కోల్‌కతా, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా హింసాకాండ చెలరేగిందని కమలదళం ఆరోపిస్తున్నది. ఈ హింసాకాండలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలు హతమయ్యారని ఆ పార్టీ ఆరోపిస్తున్నది. వ్యక్తిగతంగా దాడులు చేయడమే గాక దుకాణాలు, ఇళ్ల మీద పడి దోపిడీలు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపణ. హింసాకాండకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

బీజేపీ ఆఫీసులు, వ్యక్తులపైనే గాక కమ్యూనిస్టులపైనా దుండగులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత బెంగాల్‌లోని తమ కార్యకర్తల ఇంటిపై దాడులు, ఆఫీసుల విధ్వంసం జరిగిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఈ మేరకు ఆయన పలు ఫోటోలను స్క్రీన్ షాట్ తీసి.. ‘ఇవి బెంగాల్‌లో టీఎంసీ గెలుపు సంబురాలా..?’ అని ట్వీట్ చేశారు. కొవిడ్‌పై పోరు చేయాల్సిన సమయంలో టీఎంసీ రాజకీయ హింసను రగిలిస్తున్నదని ఆయన విమర్శలు చేశారు. దాడులను ఖండించారు. ఈ దాడుల వెనుక ఉన్నది టీఎంసీ కార్యకర్తలే అని బీజేపీ, కమ్యూనిస్టులు వాపోతున్నారు.

కాగా, బెంగాల్‌లో తమ పార్టీ కార్యాలయాలు, వ్యక్తులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బీజేపీ రేపు (మే 5న) జాతీయ స్థాయిలో ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఈ ధర్నాలో పాల్గొననున్నారు. ఇదిలాఉండగా.. బెంగాల్ లో ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసాకాండపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఈ ఘటనలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.



Next Story

Most Viewed