ఇంటర్ ఫస్ట్ క్లాస్‌ కొట్టు..స్కూటీ పట్టు

by  |
ఇంటర్ ఫస్ట్ క్లాస్‌ కొట్టు..స్కూటీ పట్టు
X

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది నాన్నలు..తమ కొడుకులు స్కూల్ ఫస్ట్ వస్తే..సైకిల్ గిఫ్ట్ ఇస్తామని..ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటే..బైక్ కొనిపెడతామని చెబుతుంటారు. ఎలాగైనా సైకిల్, బైక్ దక్కించుకోవాలని కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుని తమ తండ్రులతో శభాష్ అనిపించుకుని ఆ గిఫ్ట్స్ అందుకున్న పిల్లలు ఎంతోమంది ఉంటారు. పిల్లలు మంచిగా చదువుకోవాలని తండ్రులు ఇలాంటి బంపర్ ఆఫర్స్ ఇస్తుంటారు. అస్సాం సర్కారు కూడా.. ఇలాంటి బంఫర్ ఆఫర్ ఇస్తోంది. అయితే, అది అమ్మాయిలకు మాత్రమే. తమ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో ఫస్ట్ డివిజన్ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అమ్మాయిలకు ప్రోత్సాహకంగా స్కూటీలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

కరోనా వైరస్ ప్రభావం వల్ల..చాలా పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేసి, అందర్నీ పాస్ చేయడం చూశాం. కానీ, అస్సాం సర్కారు మాత్రం ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఫలితాలను కూడా సకాలంలో ప్రకటించింది. తాజాగా ఇంటర్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు అందజేస్తోంది. ‘ప్రజ్ఞాన్ భారతి’ పథకం కింద 22 వేల మంది విద్యార్థినులకు స్కూటీలను అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమాంత బిశ్వ శర్మ ప్రకటించారు. కాగా, ప్రభుత్వం ఇచ్చే స్కూటీలన్నీ కూడా కాలుష్యరహితమైన ‘ఎలక్ట్రిక్’ వెహికల్స్ కావడం మరో విశేషం.

ఒక్కో స్కూటీకి రూ. 50,000 నుంచి రూ. 55,000 వరకు ఖర్చు అవుతుందని.. స్కూటీలు కావాల్సిన వారు సెబాఆన్‌లైన్. ఓఆర్‌జీ (sebaonline.org) దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 15 నాటికి ఈ స్కూటీల పంపిణీ పూర్తి చేస్తామని బిశ్వ పేర్కొన్నారు. కాగా, స్కూటీలు పొందిన విద్యార్థినులు మూడేండ్ల పాటు వాటిని అమ్మకుండా ఉండేలా అస్సాం సర్కారు నిబంధన విధించింది. ఈ అవకాశం అస్సాం రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌లో చదివిన వారికే వర్తిస్తుందని విద్యా శాఖ మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉన్నత కాలేజీల్లో 25 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌లో చదివిన విద్యార్థులకే కేటాయించాలని అస్సాం ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed