చోరీకి గురైన డిగో మారడోనా వాచ్ అస్సాంలో గుర్తింపు

by  |
చోరీకి గురైన డిగో మారడోనా వాచ్ అస్సాంలో గుర్తింపు
X

దిశ, స్పోర్ట్స్: దివంగత ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనాకు చెందిన రిస్ట్ వాచ్‌ దుబాయ్‌లోని ఒక మ్యూజియం నుంచి చోరీకి గురైంది. మారడోనా మరణం తర్వాత అతడికి చెందిన వాచ్‌ను మ్యూజియంలో ఉంచారు. అయితే ఆ వాచ్ చోరీకి గురి కావడంతో అధికారులు దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడే సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న అస్సాంకు చెందిన వాజిద్ హుస్సేన్‌తో పాటు పలువురిని పోలీసులు విచారించి వదిలేశారు. అయితే పోలీసులు వదిలేయగానే అక్కడి నుంచి వచ్చేస్తే అనుమానం వస్తుందని కొన్నాళ్లు దుబాయ్‌లోనే గడిపాడు. ఆ తర్వాత తండ్రికి ఆరోగ్యం బాగాలేదనే కారణంతో వాజిద్ దుబాయ్ నుంచి ఇండియా తిరిగి వచ్చాడు.

అయితే చోరీ కేసును విచారిస్తున్న పోలీసులు వాజిద్ ఇండియాకు వెళ్లాడని తెలుసుకొని ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. అస్సాం డీజీపీ భాస్కర్ మహంత ప్రత్యేకంగా పోలీసు ఆపరేషన్ జరిపారు. శనివారం వాజిద్ ఇంట్లో సోదాలు నిర్వహించగా మారడోనా రిస్ట్ వాచ్ దొరికింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అస్సాం పోలీసుల అదుపులో ఉన్న వాజిద్‌ను పూర్తిగా విచారిస్తున్నారు. ఎయిర్‌పోస్టులో కస్టమ్స్‌ను కూడా దాటి ఎలా వాచీని తీసుకొని వచ్చాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ వాచ్ ఖరీదు దాదాపు రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed