జైపూర్ రిసార్ట్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు. ఎందుకో తెలుసా..?

by  |
జైపూర్ రిసార్ట్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు. ఎందుకో తెలుసా..?
X

గువహతి : సాధారణంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచిన అభ్యర్థులతో పార్టీల బేరసారాలు సాగుతాయి. కానీ అసోంలో మాత్రం కొత్త ట్రెండ్ మొదలైంది. ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే.. ఇంకా ఫలితాలకు ఇరవైరోజులకు పైగా సమయం ఉండగానే సదరు అభ్యర్థులను ‘దాచేస్తున్నారు’. గెలిచిన వారు ఎక్కడ ఇతర పార్టీల్లోకి ‘జారుకుంటారో’ననే అనుమానంతో వారిని కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అసోంలో కాంగ్రెస్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. మూడు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అసోంలో ఇటీవలే ముగిశాయి. ఎన్నికల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది.

అయితే, ఈసారి ఈశాన్య రాష్ట్రాల ముఖద్వారమైన అసోంలో అధికార జెండా ఎగురవేయాలని అనుకుంటున్న కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. ఆ పార్టీతో పాటు ‘మహాజాత్’ కూటమిలో ఉన్న మిగతా పార్టీలకు చెందిన అభ్యర్థులను రిసార్టులకు తరలిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లోని జైపూర్‌లో రిసార్టులలోకి వారిని చేర్చుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎఐయూడీఎఫ్), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)లకు చెందిన సుమారు 22 మంది అభ్యర్థులు జైపూర్‌లోని ఓ రిసార్టులో ఉన్నారు. ఒకే హోటల్‌లో వారందరినీ ఉంచినట్టు తెలుస్తున్నది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీ కారణంగా అసోంలో బీజేపీ ఈ దఫా అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనని ఇప్పటికే సర్వేలు వెల్లడిస్తున్న తరుణాన.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు.



Next Story