'దేశ వృద్ధిరేటు సానుకూలం'!

by  |
దేశ వృద్ధిరేటు సానుకూలం!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్థూల ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి సానుకూలంగా మారుతుందని ప్రముఖ ఆర్థికవేత్త అషిమా గోయెల్ చెప్పారు. కొవిడ్-19 వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు దాని తీవ్రతను తగ్గించాయని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటును పలు రేటింగ్ సంస్థలు సవరిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇటీవలే ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సభ్యురాలిగా నియమితులైన అషిమా గోయెల్, అనేక సంస్కరణల్లో పురోగతి కనిపిస్తోందని, ఇది దీర్ఘకాలిక వృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత సప్లై చైన్ పుంజుకుని వ్యాపారం, వాణిజ్య కార్యకలాపాలు తిరిగి పూర్వస్థాయిలో కొనసాగుతున్నాయని చెప్పారు. మరికొద్దిరోజుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చివరి రెండు త్రైమాసికాల్లో దేశ జీడీపీ వృద్ధి సానుకూలంగా మారనున్నట్టు అషిమా గోయెల్ వెల్లడించారు. అత్యధికంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పకాలికంగానే ఉంటుందని, కొంతకాలంగా సప్లై చైన్‌లో ఏర్పడ్డ అంతరాయాల వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు.

Next Story