పాత సైకిల్‌తో e-బైక్.. యూనిట్‌కు 50 కి.మీ ప్రయాణం!

by  |
పాత సైకిల్‌తో e-బైక్.. యూనిట్‌కు 50 కి.మీ ప్రయాణం!
X

దిశ, ఫీచర్స్ : రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. వాహనం తీయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప‍్త నిరసనలు కొనసాగుతుండగా.. నెటిజన్లు #ThankYouModiJiChallenge హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని నమ్ముకోవడం కంటే, తనను తాను నమ్ముకోవడం ఉత్తమనుకున్న తమిళనాడు వ్యక్తి.. తన సైకిల్‌నే e-బైక్‌గా మార్చేయడం విశేషం.

విల్లుపురంలోని పకమేడు గ్రామానికి చెందిన 33 ఏళ్ల భాస్కరన్.. మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా హోల్డర్. గతేడాది పాండమిక్ కారణంగా ఉద్యోగం మానేయాల్సి రావడంతో, వ్యవసాయంపై దృష్టి సారించాడు. అయితే ఖాళీ సమయాల్లో మాత్రం ఎలక్ట్రిక్ సైకిల్స్‌ గురించి తెలుసుకునేవాడు. ఈ క్రమంలోనే ఓ పాతసైకిల్‌ను రూ. 2 వేలకు కొనుగోలు చేసి, దాన్ని e-సైకిల్‌గా మార్చేశాడు. ఇందుకోసం రూ. 18 వేల విలువైన స్పేర్ పార్ట్స్‌ ఉపయోగించాడు. అతడు రూపొందించిన e-బైక్.. ఒక్క యూనిట్ కరెంట్‌తో 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ మేరకు రూ. 20 వేల ఖర్చుతో అద్భుతమైన మైలేజీనిచ్చే e-సైకిల్ రూపొందించాడు భాస్కరన్.

‘ఎలక్ట్రికల్ మోటార్, బ్యాటరీ, కంట్రోలర్, బ్రేక్ కట్ ఆఫ్ స్విచ్’ వంటి విడిభాగాలను సైకిల్‌కు అమర్చాను. బ్యాటరీని ఒక యూనిట్ వరకు చార్జ్ చేయవచ్చు. గరిష్టంగా 30 కి.మీ. వేగంతో వెళ్లొచ్చు. చార్జింగ్ అయిపోతే పెడ్లింగ్ చేయడం ద్వారా బ్యాటరీని రీచార్జ్ చేయవచ్చు. పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో e-సైకిల్ సామాన్యులకు ఉపయోగకరంగా ఉండటమే కాక, పర్యావరణానికి మేలు చేసినవాళ్లం అవుతాం. త్వరలోనే దీనికి పేటెంట్ లభించనుండగా.. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలతో గుర్తింపు తెచ్చుకోవాలనేది నా డ్రీమ్. అంతేకాదు దివ్యాంగుల కోసం కూడా అతి తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వీల్‌చైర్‌ను రూపొందించాలని అనుకుంటున్నాను. – భాస్కరన్


Next Story