అరవింద్ ఫ్యాషన్స్ నికర నష్టం రూ. 213 కోట్లు

by  |
అరవింద్ ఫ్యాషన్స్ నికర నష్టం రూ. 213 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశీయ దుస్తుల బ్రాండ్ అరవింద్ ఫ్యాషన్స్ (Arvind Fashions) జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 213 కోట్ల నికర నష్టాలను వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కంపెనీ దుకాణాలను మూసేయడంతో నష్టాలు నమోదైనట్టు తెలిపింది. సాధారణ దుస్తులతో పాటు, డెనిమ్ (Denim) ఉత్పత్తుల అమ్మకాలు 81 శాతం క్షీణించినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

టెక్స్‌టైల్ పరిశ్రమ కరోనా ప్రభావంతో దారుణంగా దెబ్బతిన్నది. తమ వ్యాపారాలపై ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పెంచేందుకు, వ్యూహాత్మక కార్యక్రమాలను చేపట్టామని అరవింద్ ఫ్యాషన్స్ వెల్లడించింది. కొవిడ్-19 నష్టాలను అధిగమించేందుకు వ్యయాన్ని తగ్గించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే 63 శాతం ఖర్చులను నియంత్రించినట్టు అరవింద్ ఫ్యాషన్స్ సీఈవో సురేష్ తెలిపారు.

అలాగే, కరోనా వైరస్ కంపెనీ ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపించినప్పటికీ, తమ డిజిటల్ సామర్థ్యాలను అప్‌గ్రేడ్ చేసేందుకు పెట్టుబడులను పెంచుకున్నట్టు సురేష్ వెల్లడించారు. మూలధన వ్యయాన్ని నియంత్రించేందుకు అవసరమైన రూపకల్పనకు కరోనా సమయాన్ని ఉపయోగించినట్టు సురేష్ వివరించారు.

లాక్‌డౌన్ అనంతరం 88 శాతం దుకాణాలను తిరిగి ప్రారంభించామని, గతేడాదితో పోల్చితే ఆగష్టులో 46 శాతం అమ్మకాలను సాధించినట్టు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. వాల్‌మార్ట్ (Walmart) యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సంస్థ జులైలో అరవింద్ ఫ్యాషన్స్ అనుబంధంగా ఉన్న అరవింద్ యూత్ బ్రాండ్‌లో 27 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed