మహబూబ్ నగర్ కలెక్టర్ పై హెచ్చార్సీలో ఫిర్యాదు 

by  |

దిశ, మహబూబ్ నగర్: తమ భూమికి దొంగపట్టా సృష్టించి కొంతమంది కాజేయాలని చూస్తున్నారని జిల్లా కలెక్టర్, జడ్చర్ల సీఐకి ఫిర్యాదు చేసి ఏడాది గడుస్తున్నావారు పట్టించుకోవడం లేదని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు నమోదైంది. వివరాల్లోకివెళితే.. రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండలం రచాలపల్లి గ్రామానికి చెందిన అరునా బేబి తమ్ముడి పేరుపై ఉన్న భూమిని కొంతమంది కుట్రపూరితంగా దొంగపట్టా సృష్టించి ఫోర్జరీ సంతకాలతో హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని..న్యాయం చేయాలని కలెక్టర్, పోలీసులను ఆశ్రయిస్తే వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన చిన్నతనంలోనే తండ్రి మరణించగా ఆయన పేరు మీద పెద్ద అధిరాల గ్రామ శివారులో ఉన్న2.26గుంటల భూమిని తమ పెద్దమ్మ శంకరమ్మ పేరుపై మార్పించినట్టు చెప్పారు. ఆమె మరణాంతరం తన తమ్ముడు కనుకూరి మల్లేష్ పేరు మీదకు మార్చగా, ఇటీవల అనారోగ్యంతో అతను కూడా మృతి చెందాడు. అయితే, తమ తమ్ముడు నివాసముండే జడ్చర్ల మండలం గంగాపూర్‌కు చెందిన చెన్నయ్య, మల్లేష్ పెద్దమ్మ కుమారుడైన లింగంపేటకు చెందిన బలరాజ్ మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తన తమ్ముడి ఇంట్లో చొరబడి అతని ఇంట్లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకం, ఏటీఎం కార్డులు, తదితర వస్తువులను కాజేశారని వివరించారు. అలాగే ఆ భూమిని శంషాబాద్‌కు చెందిన బాబూరావు అనే వ్యక్తి పేరు మీదకు బదిలీ చేసేందుకు ఫోర్జరీ సంతకాలు, దొంగపట్టా సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని గతేడాది ఆగస్టు18న పోలీసులకు ఫిర్యాదు చేశామని, అలాగే గతేడాది నవంబర్ 4న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే తమ ఫిర్యాదు పై జిల్లా అధికారులు ఇంతవరకు స్పందించడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని అరునా బేబి హెచ్చార్సీని కోరారు.

Next Story

Most Viewed