వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలి: పద్మారావు గౌడ్

by  |
వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలి: పద్మారావు గౌడ్
X

దిశ,సికింద్రాబాద్: దశల వారీగా అందించే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ‌లో రైల్వే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించాలని తెలంగాణా శాసన సభ ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అందుకు గాను సికింద్రాబాద్‌లోని కేంద్రీయ రైల్వే ఆసుపత్రిలో వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఈ మేరకు అయన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు బుధవారం లేఖ రాశారు. వ్యాక్సిన్ పంపిణీకి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిన దశలో రైల్వే ఆసుపత్రిలో కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలన్నారు.

దీని వల్ల నిత్యం వివిధ ప్రతికూల పరిస్థితుల్లో సైతం సమర్ధవంతంగా విధులు నిర్వర్తించే రైల్వే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు. గతంలో అయన విజ్ఞప్తి మేరకే రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌లోని కేంద్రీయ రైల్వే ఆసుపత్రిలో కోవిడ్ రోగుల చికిత్స ప్రత్యేక వార్డుకు అనుమతిని మంజూరు చేసింది. కాగా రైల్వే ఆసుపత్రిలో వ్యాక్సిన్ అందించే సదుపాయాన్ని కల్పించాలని పద్మారావు గౌడ్ ప్రతిపాదించడం పట్ల దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీ.హెచ్. శంకర్ రావు తో పాటు రైల్వే కార్మిక సంఘాల నేతలు కృతఙ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed