శ్రీరామనవమి.. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు

by  |
శ్రీరామనవమి.. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఈసారి శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉత్సవాలను వీక్షించేందుకు భద్రాచలం వచ్చే భక్తుల కోసం భక్తిభావం ఉట్టిపడేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో రామనామం మార్మోగేలా పట్టణ పరిరస ప్రాంతాల్లో ఉత్సవాలను వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు, పట్టణ కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కల్యాణం నిర్వహించే మిథాలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలన్నారు. దేవస్థానాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దన్నారు.

ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు

భక్తులకు ఇబ్బందుల్లేకుండా తలంబ్రాల కోసం 40 కౌంటర్లు, లడ్డూ విక్రయాల కోసం 15కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాములోరి కల్యాణం టికెట్ల కోసం ఆన్‌లైన్ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. గోదావరి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్లతోపాటు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మహిళా భక్తులు స్నానాలు చేసేందుకు తాత్కాలిక గదులు, పట్టణంలోని పలు కూడళ్లలో మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాలను వీక్షించేందుకు ఈ సారి భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ సరిగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు చేసే ఏర్పాట్లను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించుకుంటూ నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.


Next Story

Most Viewed