రాష్ట్రపతి శీతాకాల విడిదికి పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్ హరీశ్                                

by  |
రాష్ట్రపతి శీతాకాల విడిదికి పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్ హరీశ్                                
X

దిశ ప్రతినిధి,మేడ్చల్: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది నేపథ్యంలో హైదరాబాద్ రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఈనెల 29వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు ఉండనున్నారు. అందుకు సంబంధించిన వివిధ ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగానే రాష్ట్రపతి శీతాకాల విడిదికి ఈనెల 29వ తేదీన హకీంపేట ఎయిర్ పోర్టులోకి వచ్చి అక్కడ నుంచి బొల్లారం చేరుకుంటారన్నారు.

జనవరి 3వ తేదీ వరకు రాష్ట్రపతి ఇక్కడే ఉంటారని కలెక్టర్ వివరించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. అందుకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక తో రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హకీంపేట విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు కలెక్టర్ వివరించారు. ఈ మేరకు విమానాశ్రయంలో అంబులెన్స్ అందుబాటులో ఉంచడంతో పాటు ఆర్టీపీఎస్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.

అలాగే హకీంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతితో పాటు మరికొందరు వీఐపీలు వెళ్ళ నున్నందున రోడ్లు ఎలాంటి గుంతలు, గతుకులు లేకుండా చూడాలని అందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టి రోడ్లను బాగు చేయాలని దీంతో పాటు షామియానాలు (టెంట్లు), కుర్చీలు, సభావేదిక కు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేయాల్సిందిగా రోడ్లు, భవనాల శాఖ అధికారి శ్రీనివాస్ మూర్తికి సూచించారు. మున్సిపల్ అధికారులు సైతం ఎక్కడ కూడా చెత్త కనబడకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సంబంధిత కమిషనర్కు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నరసింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed