ధర్మపురి ఆలయానికి మహర్దశ.. రంగంలోకి పురావస్తు శాఖ

by  |
darmapuri-temple
X

దిశ, ధర్మపురి : నవ నృసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయాన్ని పురావస్తు శాఖ అధికారులు బుధవారం సందర్శించారు. యాదాద్రి, వేములవాడ ఆలయాల మాదిరిగానే ఇక్కడి పురాతన లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయాన్ని కూడా గొప్పగా పునః నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన విషయం తెలిసిందే. ఇందుకు రూ.100 కోట్లు కూడా మంజూరు చేశారు. ఇది పురాతన ఆలయం కావడంతో పురావస్తు శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవలసి ఉంది. ఇందులో భాగంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచనల మేరకు సంబంధిత అధికారులు బి.నారాయణ, రాములు నాయక్, సాగర్, మాధవి తదితరులు ఆలయాన్ని, ఆలయ పరిసరాలను పరిశీలించారు.

ఉగ్ర నరసింహా, యమ ధర్మరాజు, సత్యవతి ఆలయాలు, వైకుంఠ ద్వారం, మహారాజ గోపురం, కోనేరు, రామలింగేశ్వర ఆలయ ముఖ ద్వారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, పి.ప్రవీణ్ కుమార్ శర్మ, అర్చకులు ఎన్.శ్రీనివాసాచార్యులు, నంబి శ్రీనివాసా చార్యులతో చర్చించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట డీసీఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎం.రాజేష్, దేవాదాయ శాఖకు చెందిన రాజేష్, డీఈ రఘునందన్, సూపరిండెంట్ డి.కిరణ్ వెంట ఉన్నారు.


Next Story