ఏపీకి చుక్కలు చూపించిన ఏప్రిల్

by  |
ఏపీకి చుక్కలు చూపించిన ఏప్రిల్
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏప్రిల్ నెల చుక్కలు చూపించింది. మార్చి నెలలోనే దేశంలో కరోనా వైరస్ చొరబడింది. తొలుత కేరళలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మార్చి నెలాఖరు నాటికి వివిధ రాష్ట్రాల్లో కరోనా దడ పుట్టించింది. తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసులు చెప్పుకోతగ్గ రీతిలోనే కనిపించాయి. ఏప్రిల్ తొలి రెండు వారాల్లో ఏపీలో పెద్దగా కరోనా కేసులు నమోదు కాలేదు. దీంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన తబ్లిఘీ జమాత్ మర్కజ్‌లో సంబంధాలు బయటపడ్డంత వరకు తెలుగు రాష్ట్రాలు రెండూ కరోనాను కాస్తో కూస్తో కట్టడిచేశాయి. ఏప్రిల్ రెండో వారం మధ్యలో తెలుగు రాష్ట్రాలకు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు కరోనా తాకిడి పెరిగింది. మార్చి 31నాటికి 44 పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. ఏప్రిల్‌ మొదటిరోజే 67 కేసులతో ప్రారంభమైంది. వరుసగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఆందోళన పెంచాయి. గత మూడు వారాలుగా రోజూ 70కి తక్కువ కాకుండా కేసులు నమోదవుతూ ఏపీ వైద్యఆరోగ్య శాఖాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఈ నెలలో కేవలం 30రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 1,359 కేసులు నమోదయ్యాయంటే ఏపీపై కరోనా ఏ స్థాయిలో పంజా విసిరిందో ఊహించవచ్చు.

పరీక్షలు జరుపుతున్నాం.. కేసులు బయటపడుతున్నాయని ప్రభుత్వాధికారులు వివరణ ఇస్తున్నప్పటికీ అది అంత ఆశావహంగా కనిపించండం లేదు. కరోనా వ్యాప్తి చెందితే కేసులు నమోదు కావు, నమోదవుతున్నాయంటే కేసులు పెద్దఎత్తున వ్యాప్తి చెందుతున్నట్టే కదా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే.. పరీక్షలు మినహా అదనపు సమాచారం ఇవ్వడం లేదు. దీంతో కరోనా తీవ్రత ఇదే రీతిన కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఈ నెలలో కరోనా ఉధృతి మరి తీవ్రంగా ఉంటుందని ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అనిపిస్తోంది.

కర్నూలు జిల్లా 500 మార్కుకు దిశగా సాగిపోతోంది. గుంటూరు 300 దాటేసింది. కృష్ణా 250 దాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మూడు జిల్లాల్లో కేసులు ఈ నెల పెరిగిపోయే అవకాశముందని వైద్యారోగ్యశాఖ అంచనావేస్తోంది. ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో అయితే వరుసగా 81, 80, 82 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే జోరు కొనసాగితే మే నెలలో ఏపీలో కేసులు 2000 దాటే ప్రమాదముందని నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు మే నెల ఎండలకు కరోనా వైరస్ మాడి మసైపోతుందని ప్రపంచదేశాలు కోడైకూస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు వైరస్ మనగడ సాగించలేదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఇరాన్, ఆఫ్రికా వంటి అధిక ఉష్ణోగ్రతల దేశాలను ఉదాహరణ చూపుతూ ఈ వాదనను కొట్టిపడేస్తున్నారు. మొత్తంగా కరోనా వైరస్ పీచమణిచేందుకు మే నెల అత్యంత కీలకం కానుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ లెక్కన ఏపీ, తెలంగాణలో ఇప్పటికే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 38, 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.

Tags: coronavirus, covid-19, april, corona cases

Next Story

Most Viewed