134 శాతం పెరిగిన పారిశ్రామికోత్పత్తి

by  |
134 శాతం పెరిగిన పారిశ్రామికోత్పత్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత పారిశ్రామికోత్పత్తి గతేడాదితో పోలిస్తే 134.4 శాతం పెరిగినట్టు శుక్రవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఈ స్థాయి రికవరీ గతేడాది కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ విధించడం వలన దిగజారిన పారిశ్రామికోత్పత్తి తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా నమోదైందని గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ప్రస్తుత ఏడాది మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 22.4 శాతం పెరిగినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతేడాది ఇదే నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా ఫ్యాక్టరీ ఉత్పత్తి 57.3 శాతం తగ్గింది.

ఇక, ఈ ఏడాది ఏప్రిల్ నెలకు సంబంధించి తయారీ రంగ ఉత్పత్తి 197.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో 66 శాతం క్షీణించింది. గతేడాది సంఖ్యలతో ఈ ఏడాది గణాంకాలను పోల్చలేమని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇక, మైనింగ్ కార్యకలాపాలు 37 శాతం పెరిగాయి. విద్యుత్ ఉత్పత్తి 38.1 శాతం పెరిగింది. ఇక, ప్రైవేటు పెట్టుబడులను సూచించే మూలధన వస్తువుల ఉత్పత్తి వెయ్యి శాతానికి పైగా వృద్ధిని సాధించగా, వినియోగదారు వస్తువుల ఉత్పత్తి 1,963 శాతం పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తంగా పారిశ్రామికోత్పత్తి ఐఐఅపీ సూచీ గతేడాది ఇదే నెలలో 54 పాయింట్లు నమోదు చేయగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 126.6 కు పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.



Next Story