వివాదస్పద పేరాపై క్షమాపణలు చెప్పాలి: కేంద్రంపై సోనియా ఫైర్

by  |
soniyagandi
X

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పదవ తరగతి ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో వివాదస్పదంగా మారిన పేరాపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధ్వజమెత్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పార్లమెంటులో మండిపడ్డారు. ‘స్త్రీలు స్వాతంత్ర్యం పొందడమే అనేక రకాల సామాజిక సమస్యలకు ప్రధాన కారణం… వంటి దారుణమైన ప్రకటనలు ఈ పేరాలో ఉన్నాయి.

పేరా మొత్తం ఇటువంటి ఖండించదగిన ఆలోచనలతో నిండి ఉంది. దీనిలో ఉన్న ప్రశ్నలు సమానమైన అర్థం లేనివి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆందోళనలకు నేను నా స్వరాన్ని జోడిస్తాను. సీబీఎస్ఈ నిర్వహించే ముఖ్యమైన పరీక్షలో ఇటువంటి స్త్రీ ద్వేషపూరిత విషయాలపై నేను తీవ్ర అభ్యంతరాలను లేవనెత్తుతున్నాను’ అని అన్నారు. ఇలాంటి చర్యలు విద్య ప్రమాణాలను తీవ్రంగా తగ్గిస్తాయని నొక్కి చెప్పారు.

అంతేకాకుండా ప్రగతిశీల, సాధికారత కలిగిన సమాజంలోని నియమాలు, సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు. వెంటనే సీబీఎస్ఈ, విద్యాశాఖ ఈ ప్రశ్నను వెనక్కి తీసుకోవడమే కాకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ఇలాంటి తప్పులు దొర్లకుండా నిష్పాక్షికమైన సమీక్షను నిర్వహించాలన్నారు. అంతేకాకుండా విద్యా మంత్రిత్వ శాఖ పాఠ్యాంశాలు, పరీక్షలు లింగ సున్నితత్వ ప్రమాణాలపై సమీక్షను తప్పనిసరిగా పరిగణించాలని సోనియా కోరారు.

పూర్తి మార్కులు కేటాయిస్తాం: సీబీఎస్‌ఈ

మరోవైపు సోనియా గాంధీ ప్రశ్నలు లేవనెత్తిన కొద్ది సమయంలోనే సీబీఎస్ఈ స్పందించింది. ఈ పేరా మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా లేదని తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రశ్నలకు పూర్తి స్థాయిలో మార్కులు విద్యార్థులకు ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా వివాదస్పదమైన పేరాలో.. ‘భర్త నుంచి భార్య వేరుగా ఉండటం పిల్లలపై తల్లిదండ్రుల అధికారాన్ని సన్నగిలాయి. భర్త మాటను భార్య పాటించినపుడు తల్లిగా తన పిల్లల నుంచి విధేయతతో పాటు గౌరవాన్ని పొందుతుంది’ అని ఉంది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.


Next Story

Most Viewed