నిత్యావసర విభాగంలోకి దుస్తుల ఎగుమతులను చేర్చాలని కోరిన ఏఈపీసీ!

by  |
నిత్యావసర విభాగంలోకి దుస్తుల ఎగుమతులను చేర్చాలని కోరిన ఏఈపీసీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దుస్తుల ఎగుమతులను నిత్యావసర సేవలుగా ప్రకటించాలని, ఎగుమతి చేసే యూనిట్లను దేశంలో అమలవుతున్న లాక్‌డౌన్ నుంచి మినహాయించాలని అప్పెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఏఈపీసీ) బుధవారం ప్రభుత్వాన్ని కోరింది. దుస్తుల ఎగుమతుల్లో ఎక్కువ భాగం సీజనల్, ఫ్యాషన్ తరహాకు చెందినవి ఉండటంతో ఉత్పత్తి, రవాణా సకాలంలో చేయకపోతే వాటి నాణ్యత పాడవుతుందని ఏఈపీసీ వివరించింది. కాబట్టి దుస్తుల ఎగుమతులను నిత్యావసర సేవలుగా ప్రకటిస్తూ, వాటి ఉత్పత్తికి లాక్‌డౌన్ నుంచి మినహాయించాలని, దీనికోసం కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు అవసరమైన సూచనలు జారీ చేయాలని అభ్యర్థిస్తున్నట్టు ఏఈపీసీ ఛైర్మన్ ఏ శక్తివేల్ లేఖలో పేర్కొన్నారు.

ఇతర దేశాల్లో ఉత్పత్తి జరిగిన దుస్తులు ఎక్కువ కాలం అలాగే ఉంటే పాడైపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయనే కారణంగా వాటి ఎగుమతులకు అనుమతులు ఉన్నాయని, దేశీయంగా కూడా ఈ వెసులుబాటు కల్పించాలని ఆయన తెలిపారు. గతేడాది భారీగా ఎగుమతుల ఆర్డర్లు రద్దు కావడం, కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఈ రంగం తీవ్రంగా దెబ్బతిన్న అంశాన్ని గుర్తించి, పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏఈపీసీ సూచించింది. కరోనా సెకెండ్ వేవ్ పరిణామాలతో ఇప్పుడిప్పుడే యూఎస్, యూరప్‌ల నుంచి పునరుద్ధరించబడిన ఎగుమతుల ఆర్డర్లు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ తరహా ఇబ్బందులను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

ఆర్డర్లు వెనక్కి వెళ్తే కష్టం..

లాక్‌డౌన్ కారణంగా ఆర్డర్లకు అనుమతి నిరాకరిస్తే స్వల్పకాలిక ఆర్డర్లు, ఎగుమతి ఆదాయాలు మాత్రమే కాకుండా కొనుగోలుదారులకు దీర్ఘకాలిక నష్టం కూడా ఏర్పడుతుందని శక్తివేల్ తెలిపారు. ఇటీవల భారత్‌కు పోటీగా బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా, పాకిస్తాన్ ప్రాంతాల వారు ఆర్డర్లను తీసుకుంటున్నారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో కొనుగోలుదారులను కోల్పోతే భవిష్యత్తులో కొత్త ఆర్డర్లను పొందడం కష్టంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దుస్తుల ఉత్పత్తి పరిశ్రమలో మొత్తం 1.3 కోట్ల మంది ప్రత్యక్షంగా ఉపాధిని కలిగి ఉన్నారు. వారి ఉపాధిపై ప్రభావం పడకుండా చూడాలని ఏఈపీసీ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

Next Story